
పదో తరగతి విద్యార్థినికి అస్వస్థత
గుర్రంకొండ : పదవ తరగతి ప రీక్షా కేంద్రంలో అందరిలాగే పరీ క్ష రాస్తున్న ఓ విద్యార్థిని అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన సంఘటన బుధవారం అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేవలం ఒక గంట మాత్రమే హిందీ పరీక్ష రాసి విద్యార్థిని కుప్పకూలడం అందరిని కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నా యి. గుర్రంకొండ ఉర్దూ జెడ్పీహైస్కూల్లో 178 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నారు. మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన కె. రామచంద్ర కుమార్తె కె. రజిత చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదివి గుర్రంకొండ ఉర్దూ జెడ్పీ హైస్కూల్లోని పరీక్షా కేంద్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తోంది. బుధవారం అందరిలాగే రామచంద్ర తన కుమార్తెను గుర్రంకొండకు తీసుకొచ్చి పరీక్షా కేంద్రంలో వదిలి తాను అక్కడి పరిసరాల్లోనే ఉన్నాడు. హిందీ పరీక్షను విద్యార్థులు రాయడం ప్రారంభించిన గంట తరువాత పరీక్షా కేంద్రంలో విద్యార్థిని రజిత కుప్పకూలిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు అక్కడే ఉన్న ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందించారు. ఆరోగ్య సిబ్బంది విద్యార్థినికి చికిత్స చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో వైద్యాధికారి చైతన్య అక్కడికి చేరుకొని వైద్యసేవలు అందించారు. ఎంతకూ విద్యార్థిని కోలుకోకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించాల్సిందిగా సూచించారు. ఎంఈఓ సురేంద్రబాబు, పరీక్షా కేంద్రం చీఫ్ రమణ 108 వాహనంలో విద్యార్థినిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
పరీక్షా కేంద్రంలోనే కుప్పకూలిన వైనం

పదో తరగతి విద్యార్థినికి అస్వస్థత