
వాతావరణ మార్పు.. మామిడి రైతు కుదుపు
పెనగలూరు : ఈ ఏడాది వాతావరణంలో మార్పుల వల్ల సంక్రాంతి వరకు వర్షాలు పడటంతో మామిడి రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతులతోపాటు వ్యాపారుల్లో కూడా గుబులు పుట్టింది. మామిడి తోటలనే నమ్ముకొని జీవిస్తున్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు ఇప్పటికే తేలిపోయింది. మండలంలో 3992 ఎకరాలలో మామిడి సాగు చేస్తున్నారు. శివరాత్రికి పిందెలు పుట్టి ఉగాదికి ఊరగాయంత పచ్చడి కాయలు కావాల్సి ఉంది. కానీ నేటికీ మామిడి తోటల్లో పూత దశలోనే ఉండటంతో పిందె వస్తుందా రాదా అన్న సందేహంలో రైతులు ఉన్నారు. తోటల్లో పూత విపరీతంగా వచ్చింది. పూత వచ్చిందన్న ఆనందంలో రైతులు ఉన్నప్పటికీ ఇప్పటికే పూత మాడిపోతూ రాలిపోతోంది. ఇక పిందె వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కొంతమంది వ్యాపారులు పూత రాకముందే తోటలను కొనుగోలు చేశారు. గత సంవత్సరం మామిడి కాయలు కాయకపోవడంతో ఈ ఏడాది కాపు వస్తుందని ఇటు వ్యాపారులు, అటు రైతులు ఆనందంగా ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పూతను చూసి ఇప్పటికే మూడు, నాలుగుసార్లు మందును పిచికారీ చేశారు. రైతులు బయట అప్పులు తెచ్చుకోవాలన్నా, బ్యాంకు రుణాలు తీసుకోవాలన్నా మామిడి తోటలపైనే ఆధారపడుతున్నారు. పూతకు పిందెలు నిలబడి మంచి ఫలితం రావాలని రైతులు ఆశిస్తున్నారు.
మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు..
మామిడి తోటలో కాపురాక పూతకు తగ్గ పిందె లేకపోవడంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది. 2023లో కాపు అధికంగా రావడంతో ధరలు లేక టన్ను రూ. 6 వేలు నుంచి రూ. 7 వేలుకు రైతులు అమ్మకాలు చేశారు. 2024లో కాపు 20 శాతం కూడా రాకపోగా కొంతమంది రైతులకు ఎకరాలలో మామిడి తోటలు ఉన్నా కాయలు కాయని పరిస్థితి. గత మూడు సంవత్సరాలుగా మామిడి రైతులు నష్టాన్ని చవిచూస్తున్నారు. దీంతో మండలంలోని మామిడి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టు తయారైంది.
ఆలస్యంగా పూత రావడంతో
రైతుల్లో గుబులు