
ఉపవాస దీక్ష.. ఆరోగ్య రక్ష
రాజంపేట టౌన్ : ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆచరించే ఇస్లాం మార్గదర్శకాల్లో రంజాన్ ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. రంజాన్ నెలలో 30 రోజుల పాటు కఠోర ఉపవాసాలు ఆచరించడంతో పాటు ఐదుపూటలా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నెలవంక కనిపించిన మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యే రోజా (ఉపవాసాలు) షవ్వాల్ నెలవంక దర్శనంతో ముగుస్తాయి. ప్రతి ముస్లీం నమాజు చేయడంతో పాటు ఉపవాసాలు పాటించాలని ఇస్లాం సూచిస్తుంది. వేకువ జామునే ఉపవాస దీక్ష (సహర్) ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయమయ్యాక (ఇఫ్తార్) వరకు ఉపవాసం పాటిస్తారు. పగలంతా ఉపవాసం పాటించిన దీక్షాపరులు సాయంత్రం నిర్ణీత వేళలో తొలుత పండ్లు తిని దీక్ష విరమిస్తారు. ఉపవాసం విరమించే వారికి అనేక మంది వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తుంటారు. అయితే రాజంపేట పట్టణం ఉస్మానగర్కు చెందిన షేక్ సాదిక్పాషా రంజాన్ మాసమంతా యాష్ (గంజి) పంపిణీ చేస్తారు.
గంజికి విశేష ఆదరణ..
సాదిక్పాషా పంపిణీ చేసే గంజి రాజంపేట పట్టణంలో విశేష ఆదరణ పొందింది. అందువల్ల రోజా ఉండే ముస్లీంలే కాక ముస్లిమేతరులు కూడా గంజిని తీసుకెళతారు. దాదాపు 15 సంవత్సరాలుగా సాదిక్పాషా గంజిని పంపిణీ చేస్తున్నారు. రోజుకు పదివేల రూపాయల చొప్పున నెలకు మూడు లక్షల వరకు సాదిక్పాషా గంజికోసం ఖర్చు చేస్తారు. నిత్యం సాయంత్రం వేళల్లో గంజిని పంపిణీ చేస్తారు. పట్టంంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు దాదాపు ఐదు వందల మందికి పైగా గంజిని తీసుకెళుతుంటారు.
పోషకాలకు నెలవు
రోజంతా ఉపవాసం ఉండటం వల్ల మనిషి శరీరం నీరసిస్తుంది. అందువల్ల సాదిక్పాషా అనేక పోషక పదార్థాలతో గంజిని తయారు చేయిస్తారు. ఇందులో ప్రధానంగా పెసరబేడలు, బార్లీ బియ్యం, కొబ్బరి, పుదీన, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి పదార్థాలను గంజి తయారీలో ఉపయోగిస్తారు. దాదాపు నాలుగు గంటల పాటు కట్టెల పొయ్యి మీద బాగా ఉడికించి తయారు చేస్తారు. ఈ గంజి హలీం రుచికి ఏమాత్రం తీసిపోదని ముస్లీంలు చెబుతున్నారు. గంజి బలవర్థకమైన పానీయమని అందువల్ల ఉపవాస దీక్షాపరులకు గంజి వెంటనే శక్తిని ఇవ్వడమే కాక ఆరోగ్యానికి కూడా మంచిదని వారు పేర్కొంటున్నారు.
ఉపవాస దీక్ష విరమించేవారికి
ఉచితంగా గంజి పంపిణీ
రంజాన్ మాసమంతా
కొనసాగనున్న కార్యక్రమం
రూ.3 లక్షలు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న షేక్ సాదిక్పాషా
మొదటి నుంచి ఈ గంజి తాగుతున్నా
ఉస్మాన్ నగర్లో పంపిణీ చేసే గంజిని నేను మొదటి నుంచి తాగుతున్నాను. ఎంతో రుచిగా ఉంటుంది. అందువల్ల మా ఇంట్లో వాళ్లు అందరు కూడా ఎంతో ఇష్టంగా గంజిని తాగుతారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారికి ఈ గంజి శక్తినిచ్చే ఔషధంగా పనిచేస్తుంది.
– సయ్యద్ బాషా, రాజంపేట
అల్లాహ్ కృపవల్లే..
దాదాపు 15 ఏళ్ల క్రితం ఇఫ్తార్ సమయంలో ఉపవాసం ఉండేవారికి గంజి పంపిణీ చేశాను. అప్పుడు గంజి తాగిన వారంతా ఎంతో రుచిగా ఉందన్నారు. మీరు ఎప్పుడైనా ఇఫ్తార్ సమయంలో ఆహారం పంపిణీ చేయాలనుకుంటే గంజినే పంపిణీ చేయమని ఉపవాసం ఉంటున్న వారు చెప్పారు. అల్లాహ్ నాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఉపవాస సమయంలో అల్లాహ్ స్మరణలో ఉండేవారికి రోజూ గంజి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఏడాది గంజి ఉచితంగా పంపిణీ చేస్తున్నా. ఇదంతా అల్లాహ్ కృపవల్లే జరుగుతోంది.
– షేక్ సాదిక్పాషా, ఉస్మాన్ నగర్, రాజంపేట

ఉపవాస దీక్ష.. ఆరోగ్య రక్ష

ఉపవాస దీక్ష.. ఆరోగ్య రక్ష