కమనీయం...లక్ష్మీనరసింహుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం...లక్ష్మీనరసింహుని కల్యాణం

Mar 19 2025 1:32 AM | Updated on Mar 19 2025 1:28 AM

గుర్రంకొండ : తరిగొండ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మదినం కావడంతో టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణోత్సవం కనుల పండువగా జరిపారు. ఆలయంలో చలువ పందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పాలతో క్షీరాభిషేకం చేశారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక వైభవంగా నిర్వహించారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారెడ్డి, సిబ్బంది నాగరాజ, ఆలయ అర్చకులు కృష్ణరాజ బట్టార్‌, అనిల్‌ స్వామి, గోకుల్‌ స్వామి పాల్గొన్నారు.

భార్య గర్భిణి.. మరో యువతితో భర్త పరారీ

బి.కొత్తకోట : బి.కొత్తకోట పట్టణానికి చెందిన ఓ యువకుడు కట్టుకున్న భార్యను వదిలి మరో యువతితో వెళ్లిపోయిన ఉదంతంపై బాధితురాలు మంగళవారం పోలీసులను ఆశ్రయించింది. భర్తపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పట్టణానికి చెందిన డ్రైవర్‌ అనిల్‌కు ములకలచెరువు మండలానికి చెందిన 21 ఏళ్ల యువతితో గతేడాది ఆగస్టులో వివాహమైంది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం అనిల్‌ ఇంటివద్దే జరిగింది. రెండు నెలలపాటు వీరి సంసారం సజావుగా సాగింది. తర్వాత స్థానికురాలైన ఓ యువతితో అనిల్‌ సన్నిహితంగా ఉంటున్న విషయం గమనించి భార్య ప్రశ్నించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపో అంటూ తిట్టేవాడు. సర్దుకుపోతున్న భార్య గర్భం దాల్చగా ఇప్పుడు ఆరోనెల. ఈ పరిస్థితుల్లో భర్త అనిల్‌ ఈనెల 4న ఇంటినుంచి బయటకు వెళ్లగా పనికి వెళ్తున్నాడని అనుకున్నారు. అప్పటినుంచి ఇంటికి రాకపోవడంతో భార్య ఆందోళనకు గురైంది. అయితే భర్తతో సన్నిహితంగా ఉంటున్న యువతి ఇన్‌స్టాలో పెడుతున్న ఫొటోలు చూసి అసలు విషయం గుర్తించింది. దీనితో తన భర్త మరో యువతితో వెళ్లాడని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాయచోటి కేసులో 12 మందికి బెయిల్‌

కడప అర్బన్‌ : అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై మార్చి 9వ తేదీ పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న 12 మంది మంగళవారం బెయిలుపై విడుదలయ్యారు.

9 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

మదనపల్లె : కులం పేరుతో దూషించి, దౌర్జన్యం చేసి దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని మాలేపాడు పంచాయతీ నల్లరాజుగానిపల్లెకు చెందిన బి.మునివెంకటరమణ, (69) కు సంబంధించిన పొలాన్ని స్థానికులైన కొందరు ఆక్రమించుకున్నారు. ఈ విషయమై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మునివెంకటరమణ పొలం వద్ద ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన భూ ఆక్రమణకు పాల్పడిన మరో వర్గంలోని వ్యక్తులు ఆర్‌.బాలకృష్ణమనాయుడు, కాంతమ్మ, రవికాంత్‌నాయుడు, ఆదెమ్మ, శ్రీనివాసులునాయుడు, సోమశేఖర నాయుడు, సంజు, కృష్ణమూర్తిలు దౌర్జన్యం చేసి కులం పేరుతో దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అపశ్రుతి

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల–తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ ఏర్పాట్లలో రామాలయం వెనుకవైపు ఉన్న అంగన్‌వాడీ కేంద్రం వద్ద 30 అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాట్లలో భాగంగా పనిచేస్తున్న తిరుపతి టౌన్‌కు చెందిన ఎం. నరసింహ (50) అనే వ్యక్తికి మూర్ఛ రావడంతో 25 అడుగులపై నుంచి కిందపడ్డాడు. అదృష్టవశాత్తు పడినచోట ఎలాంటి రాళ్లు, గట్టినేల లేకపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తోటి కూలీలు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం తిరుపతికి తీసుకెళ్లారు.

కమనీయం...లక్ష్మీనరసింహుని కల్యాణం             1
1/1

కమనీయం...లక్ష్మీనరసింహుని కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement