కలికిరి(వాల్మీకిపురం): భూముల రీ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు శ్రీధర్ ఛామకూరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాల్మీకిపురం మండల పరిధిలోని బూడిదవేడు గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. జనవరి 20 నుంచి గ్రామంలో రీ సర్వే ప్రక్రియ ప్రారంభించామని, ఇప్పటి వరకు వెయ్యి ఎకరాలకు పైగా పూర్తి చేసినట్లు తహసీల్దారు పామిలేటి కలెక్టరుకు వివరించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా రైతుల సమక్షంలోనే సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములు తదితరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మండల సర్వేయరు, వీఆర్ఓలు పాల్గొన్నారు.
నిర్దేశించిన లక్ష్యం సాధించాలి
గుర్రంకొండ: అధికారులు, సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి సాధించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో ఏ గ్రామంలో సర్వే చేస్తు న్నారు, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, అందులో డ్రైల్యాండ్, వెట్ల్యాండ్ ఎంత మేరకు విస్తీర్ణంలో ఉన్నాయో ఆరా తీశారు. సదరు గ్రామంలో రీసర్వే ఎప్పుడు చేపట్టారు, ఎన్ని టీములు సర్వే చేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో పూర్తి చేశారు, ఇంకా ఎంత మేరకు పెండింగ్లో ఉంది అనే వివరాలను తహసీల్దార్, మండల సర్వేయర్ను అడిగి తెలుసుకొన్నారు. మండలంలోని టి.పసలవాండ్లపల్లెలో రీసర్వే ప్రక్రియ జరుగుతోందని, గ్రామాన్ని 11 బ్లాకులూగా విభజించి 3356 ఎకరాలు సర్వే చేస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, సర్వేయర్ కిరణ్మయి, వీఆర్వోలు పాల్గోన్నారు.
కలెక్టరు శ్రీధర్ ఛామకూరి