రాయచోటి టౌన్ : రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి పల్లకీ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామి వారికి, అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించి అందంగా అలంకరించి పల్లకీలో ఉంచి ఆలయ మాఢవీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ పల్లకీ సేవ ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, శేఖరయ్య స్వామి, వేదపండితులు రాచరాయ యోగీ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లె పంచాయతీ నారమాకుల తండాకు చెందిన చినరెడ్డెప్ప నాయక్ కుమారుడు దొరస్వామి నాయక్(38) కుటుంబ సమస్యలతో ఇంటివద్దే విషపు గుళికలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.