ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో అడవి పందిని ఢీ కొని బైకుపై నుంచి కింద పడటంతో డీకాల పవన్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో అడవి పందులు అధికంగా సంచరిస్తున్నాయి. చీకటి పడగానే అడవి పందులు మందలుగా వీధుల్లోకి వస్తున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి అడవి పందుల బెడదను నివారించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
గండి దేవస్థాన భూములకు వేలం పాట
చక్రాయపేట : మండలంలోని మారెళ్ల మడక గ్రామ పంచాయతీలో ఉన్న గండి వీరాంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గండి దేవస్థాన భూములకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ఇడుపులపాయ గ్రామ సర్వే నెంబర్ 469లో గల 8.72 ఎకరాల భూమిని ఏడాది కాలానికి రూ.1.51 లక్షలకు పి.జి.మహేష్ దక్కించుకున్నారు. అలాగే వీరన్నగట్టుపల్లె గ్రామంలోని 98 సెంట్ల భూమిని రూ.4 వేలకు ఆర్.తేజేశ్వర దక్కించుకున్నారు. అలాగే గండి దేవస్థానానికి సంబంధించిన సులభ్ కాంప్లెక్స్ను రూ.20 వేలకు ఇడుపులపాయకు చెందిన పి.వెంకటరత్నం దక్కించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ, మాజీ చైర్మన్ వెంకటస్వామి, దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలు
బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్ క్రాస్ సమీపం రామాపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు. స్థానిక బీసీ కాలనీకీ చెందిన జయచంద్ర (58), సువర్ణ (50) భార్యాభర్తలు. జయ చంద్ర చిత్తూరు ఆర్టీసీ డిపోలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వీరు బైక్ పై మదనపల్లెకు వెళ్లి తిరిగి బి.కొత్తకోటకు వస్తున్నారు. హార్సిలీ హిల్స్ క్రాస్ దాటుకుని రామాపురం వద్దకు రాగానే పీటీఎం నుంచి మదనపల్లికి టమాటా లోడుతో వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జయచంద్ర కాలికి పలుచోట్ల ఫ్రాక్చర్లు అయ్యాయి, సువర్ణకు తల, పలుచోట్ల గాయాలయ్యాయి. వీరిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జయచంద్రను బెంగళూరుకు, సువర్ణను వేలూరుకు తీసుకెళ్లారు.
అడవి పందిని ఢీకొని వ్యక్తికి గాయాలు
అడవి పందిని ఢీకొని వ్యక్తికి గాయాలు