జ్యోతి క్షేత్రంలో ఆశ్రమాలు తిరిగి నిర్మించాలి | - | Sakshi
Sakshi News home page

జ్యోతి క్షేత్రంలో ఆశ్రమాలు తిరిగి నిర్మించాలి

Mar 18 2025 12:47 AM | Updated on Mar 18 2025 12:44 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : జ్యోతి క్షేత్రంలో ఇటీవల ప్రభుత్వం కూల్చివేసిన ఆశ్రమాలను తిరిగి నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ అన్నమయ్య కళాక్షేత్రం, హిందూస్‌ ఫర్‌ ఫ్లూరలిటీ అండ్‌ ఈక్వాలిటీ సంయుక్తాధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్‌స్వామి, హెచ్‌పీఈ జాతీయప్రధాన కార్యదర్శి కొవ్వూరు లోకనాథ్‌ మాట్లాడుతూ కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆశ్రమ వసతి గృహాలను అటవీ అధికారులు కూల్చివేసిన సంఘటన లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కూల్చివేతలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత జాతీయ ఉపాధ్యక్షుడు వంశీ, గురవయ్య, పలువురు భజన కళాకారులు పాల్గొన్నారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు.

రేపు విజయవాడలో మహా ధర్నా

పులివెందుల టౌన్‌ : మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాంద్‌ బాషా తెలిపారు. సోమవారం పులివెందుల పట్టణంలో ఆయన మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథక కార్మికులకు నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వాలని, ఎలాంటి కారణాలు లేకుండా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆటోను ఢీకొన్న

ఐచర్‌ వాహనం

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆటోను గుర్తు తెలియని ఐచర్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ చంగల రామాంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని డ్రైవర్‌ కొట్టాల కాలనీకి చెందిన అల్లం లక్ష్మీనారాయణమ్మ, అల్లం జగన్నాథం, అల్లం నాగ పద్మ, అల్లం నాగ బిందు, జి.నాగముని, జి. రామాంజనేయులు ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందినవారేరు. వీరంతా ప్రొద్దుటూరు వెళ్లేందుకు చంగల రామాంజనేయులుకు చెందిన ఆటో ఎక్కారు. ఎస్వీ కల్యాణ మండపం వద్దకు రాగానే ఆటో వెనుక వైపు గుర్తు తెలియని ఐచర్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ చంగల రామాంజనేయులు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

లింగాల సబ్‌ స్టేషన్‌లో

అగ్నిప్రమాదం

లింగాల : మండల కేంద్రంలోని 133 కేవీ సబ్‌ స్టేషన్‌లో సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సబ్‌ స్టేషన్‌ సిబ్బంది ఫోన్‌ చేయడంతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సబ్‌ స్టేషన్‌ ఆవరణలో భారీగా ముళ్ల పొదలు ఉండటంతో ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది మంటల తీవ్రత ట్రాన్స్‌ఫార్మర్లకు తగలకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫైర్‌ సిబ్బంది అనిల్‌ కుమార్‌, రవీంద్రారెడ్డి, డ్రైవర్‌ ఆపరేటర్‌ బుజ్జిబాబు పాల్గొన్నారు. 133 కేవీ సబ్‌ స్టేషన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని ఏఈ రమేష్‌ తెలిపారు. ముందు జాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement