కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు! | - | Sakshi
Sakshi News home page

కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!

Mar 17 2025 3:03 AM | Updated on Mar 17 2025 11:24 AM

గుర్రంకొండ : పీలేరు నియోజకవర్గంలోని రైతులు, ప్రజలు రాత్రంతా జాగారం చేసే పని తప్పడం లేదు. నియోజకవర్గంలోని ఆరుమండలాల పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు కొండలు, గుట్టలకు నిప్పు అంటిస్తున్నారు. దీంతో 1835 ఎకరాల్లో కొండలు, గుట్టలు కాలి బూడిదయ్యాయి. వీటితోపాటు మామిడితోటలు, టమటా తోటలతోపాటు పలు రకాల పంటలు దగ్ధమవుతున్నాయి. ఆయా పరిసర పొలాలకు చెందిన రైతులు మంటలు పొలాల వైపు రానీయకుండా రాత్రిళ్లు పొలాల వద్దే జాగారం చేస్తున్నారు. నీళ్ల ట్యాంకర్ల ద్వారా పొలాలవైపు వస్తున్న మంటల్ని రైతులు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది రైతులు గుట్టల కింద ఉన్న పొలాలవైపు మంటలు రాకుండా జేసీబీలతో కందకాలు తవ్వుకుంటున్నారు.

1678 ఎకరాల్లో కాలిపోయిన

కొండలు, గుట్టలు..

గత వారం రోజులుగా నియోజకవర్గంలోని కొండలు, గుట్టలకు కొంతమంది దుండగులు కావాలనే నిప్పు పెడుతున్నారు. అన్ని మండలాల్లో ఇప్పటివరకు 21 మార్లు అగ్నిప్రమాదాలు జరిగి మొత్తం 1678 ఎకరాల్లో కొండలు, గుట్టలతోపాటు మామిడితోటలు, పొలాలు కాలిబూడిదయ్యాయి. పొలాల్లో అమర్చిన డ్రిప్‌ పరికరాలు, టమాటా సీడ్స్‌ కట్టెలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో లక్షలాది రూపాయలు రైతులు నష్టపోయారు. రాత్రిళ్లు ఉన్నట్టుండి కొండలు, గుట్టల్లో మంటలు చెలరేగుతున్నాయి. అవి కింది భాగాన ఉన్న పొలాలు, మామిడితోటలవైపు దూసుకొస్తున్నాయి. సంబంధిత పొలాల రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్లు, పొదలతో పాటు పక్షులు, సర్పాలు, అడవి జంతువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. నియోజకవర్గంలోని జాతీయ రహదారులకు ఇరువైపులా ఉన్న కొండలు, గుట్టలు రాత్రి పగలు అనే తేడా లేకుండా కాలుతూనే ఉండడం గమనార్హం.

రాత్రిళ్లు జాగారమే.!

కాలుతున్న కొండలు, గుట్టల కింది భాగంలో పెద్ద ఎత్తున మామిడితోటలు, ఇతర ఉద్యానవన తోటలతోపాటు పలురకాల పంటలు సాగవుతున్నాయి. దీంతో రైతులు రాత్రిళ్లు పొలాల దగ్గరే కాపలా కాస్తూ జాగారం చేస్తున్నారు. టెంకాయపట్టలు, పచ్చి వేపకొమ్మలు, దుమ్ముధూళితో గుట్టల దిగువ వైపు వస్తున్న మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో చుక్కనీరు లేక పోవడంతో పట్టణం నుంచి వాటర్‌ ప్యాకెట్ల బస్తాలను తీసుకెళ్లారు. మరికొందరు గుట్టల్లో నుంచి వచ్చే మంటలు పొలాలవైపు రానీయకుండా జేసీబీతో పొలాల సరిహద్దుల్లో కందకాలు తవ్వారు. ఇలా రాత్రిళ్లూ రైతులు నానా కష్టాలు పడ్డారు. కొంతమంది కావాలనే పరిసరాల్లో ఇష్టానుసారం కొండలు, గుట్టలకు నిప్పు అంటిస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.

నీళ్ల ట్యాంకర్లు, స్ప్రే పంపులతో

మంటలు అదుపు ..

పొలాల వైపు వస్తున్న మంటల్ని అదుపు చేసేందుకు పొలాల వద్ద నీళ్ల ట్యాంకులు సిద్ధం చేసుకొంటున్నారు. నీళ్ల ట్యాంకులతో పాటు పంటలపై మందులు స్ప్రే(పిచికారీ) చేసే పెట్రోల్‌ పంపులు, ఇంజిన్లను పొలాల వద్దకు తీసుకెళుతున్నారు. మంటలు కొండలు, గుట్టల నుంచి పొలాలవైపు వచ్చే సమయంలో నీళ్ల ట్యాంకుల నుంచి నీటిని ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నింపి తద్వారా పెట్రోల్‌ ఇంజిన్లు, పైపుల ద్వారా నీటిని మంటలపై స్ప్రే చేస్తూ అదుపు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

వందల ఎకరాల్లో కాలిపోయిన,

కొండలు గుట్టలు

దిగువ పొలాల రైతులకు

రాత్రిళ్లు తప్పని జాగరణ

నీళ్ల ట్యాంకర్లు, స్ప్రే మిషన్ల ద్వారా మంటలు అదుపు చేస్తున్న వైనం

రాత్రిళ్లు జాగారం తప్పడం లేదు

కొన్ని రోజులుగా మా పొలాల సమీపంలో ఉన్న కొండలు, గుట్టల్లో మంటలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. మంటలు పొలాల వైపు రాకుండా రాత్రిళ్లు అక్కడే జాగారం చేయాల్సి వస్తోంది. మాతో పాటు పరిసర పొలాల రైతుల కూడా పొలాల వద్దనే ఉంటున్నారు. రోజుల తరబడి మంటలు వస్తూనే ఉన్నాయి. అటవీశాఖ అధికారులు, సిబ్బంది మాకు సహాయం చేశారు.

– రెడ్డెప్ప, రైతు, చిట్టిబోయనపల్లె

కావాలనే నిప్పు పెడుతున్నారు

కొండలు, గుట్టలకు గత పది రోజులుగా కావాలనే నిప్పు పెడుతున్నారు. కొంతమంది వ్యక్తులు పొలాల వద్ద చెత్తా చెదారం కాల్చివేయాలనే ఉద్దేశంతో నిప్పు పెడుతున్నారు. దీంతో అవి పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ పరిసర పొలాలతో పాటు కొండలు, గుట్టల్ని కాల్చి బూడిద చేస్తున్నాయి. మంటలు అదుపు చేసే వారే లేక పదిరోజులుగా కొండలు, గుట్టలు, అడ్డూ ఆపులేకుండా కాలుతూనే ఉన్నాయి.

– గయాజ్‌ అహ్మద్‌, గుర్రంకొండ

కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!1
1/3

కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!

కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!2
2/3

కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!

కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!3
3/3

కొండలకు నిప్పు.. పంటలకు ముప్పు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement