బి.కొత్తకోట : గుర్తు తెలియని వ్యక్తి నుంచి మొబైల్కు వచ్చిన మేసేజ్ ఓపెన్ చేయగానే రూ.4.89 లక్షలు కాజేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. మండలంలోని నాయనబావికి చెందిన దాదం లోకనాథరెడ్డి మొబైల్కు గతనెల 14న ఓ మెసేజ్ వచ్చింది. దాన్ని చూసిన లోకనాథరెడ్డి క్లిక్ చేసి తెరిచాడు. అప్పటికప్పుడు గట్టు కెనరా బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా రూ.4,89,858 నగదు వేరే ఖాతాలకు బదిలీ అయిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన బాధితుడు నెల తర్వాత ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
ఆత్మహత్య కేసులో
ముగ్గురు నిందితుల అరెస్టు
మదనపల్లె : ఆత్మహత్య కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని పోతబోలు పంచాయతీ సిద్దమ్మగారిపల్లెలో ఫిబ్రవరి 20న స్థలం విషయమై వివాదం ఏర్పడగా స్థానికుడైన హసినాబీ కుమారుడు గిరిబాబు (42) పై కొందరు వ్యక్తులు దాడి చేసి కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన గిరిబాబు ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలను, వ్యక్తుల వివరాలను సూసైడ్ నోట్లో తెలిపాడు. ఆత్మహత్య సంఘటనపై తల్లి హసినాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం శనివారం నిందితులైన మదనపల్లెకు చెందిన గంగులప్ప కుమారుడు అనిల్ (25), గంగులప్ప భార్య అరుణ(45), వారి బంధువైన వెంకటరమణ కుమారుడు శివప్రసాద్ (32)లను దేవతానగర్ వద్ద అరెస్టు చేశామన్నారు. వారిని రిమాండు నిమిత్తం కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు.
హార్సిలీహిల్స్ రోడ్డుకు మరమ్మతులు
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుకు శనివారం మరమ్మతు పనులు చేపట్టారు. రహదారి భవనాలశాఖ అధికారులు ఘాట్రోడ్డపై దెబ్బతిన్న చోట్ల గుర్తించి వాటికి ప్యాచ్లు వేశారు. ఈ రోడ్డు అభివృద్ధి కోసం అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైతే కొత్తగా రోడ్డు వేయనున్నారు.