కురబలకోట : అతి వేగం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కృష్ణపట్నం నుంచి గాలివీడుకు కడప బండలతో లారీ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కంటైనర్ మండలంలోని తానామిట్ట వద్ద శుక్రవారం వేకువ జామున వేగంగా ఢీకొన్న విషయం తెలిసిందే. రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ఈ వాహనాలలోని కంటైనర్ డ్రైవర్ భాస్కర్ (36) లారీ క్లీనర్ సయ్యద్ హసన్ (28) క్యాబిన్లోనే ఇరుక్కుపోయి విగతజీవులుగా మారారు. జేసీబీల సాయంతో అతి కష్టం మీద వీరిని బయటకు తీశారు. లారీ డ్రైవర్ నాగేశ్వరరావు (36)కు తీవ్ర గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలను పరిశీలించారు. సంఘటన స్థలాన్ని బట్టి పరిశీలిస్తే కంటైనర్ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా స్పష్టమవుతోంది. మంగళూరు నుంచి ఎన్పీ కుంటలో సోలార్ ప్యానల్ను అన్లోడు చేసి తిరిగి ఇది ఖాళీగా వెళుతోంది. ముదివేడు సమీపంలోని తానా మిట్ట వద్ద డౌన్లో ఇది వేగంగా వెళుతుండగా లోడుతో మెల్లగా మిట్ట ఎక్కుతున్న లారీని ఒక్కసారిగా ఢీకొన్నట్లు సంఘటన స్థలాన్ని బట్టి గమనిస్తే తెలుస్తోంది. దూసుకు వచ్చిన కంటైనర్ను పసిగట్టిన లారీ డ్రైవర్ రెప్పపాటులో అప్రమత్తమై లారీని ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అతను తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. పక్కనున్న క్లీనర్ మృతి చెందాడు. లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. గేర్ బాక్సు కూడా ఊడి బయటపడిందంటే కంటైనర్ ఎంత వేగంగా వచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దుర్ఘటన రెండు కుటుంబాల్లో విషాదానికి కారణమైంది.
అతి వేగం.. రెండు కుటుంబాల్లో విషాదం !