ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ

Mar 15 2025 12:46 AM | Updated on Mar 15 2025 12:46 AM

ఆలయంల

ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ

మదనపల్లె : ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీకి గురైన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. అంకిశెట్టిపల్లె పంచాయతీ గాంధీపురంలోని కోదండరామస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆలయానికి అమర్చిన మైక్‌ సెట్‌ను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు చోరీ ఘటనపై టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైక్‌ సెట్‌ విలువ సుమారు రూ.11వేలు ఉంటుందని పేర్కొన్నారు. తాలూకా సీఐ కళావెంకటరమణ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.

గిరిజన మహిళపై దాడి

మదనపల్లె : భూ వివాదంలో కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని గిరిజన మహిళ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ స్టేషన్‌కు వెళితే న్యాయం చేయకపోగా, తనపైనే కేసు బనాయించారని ఆరోపించారు. ఆమె వివరాల మేరకు.. పట్టణంలోని చంద్రా కాలనీకి చెందిన కృష్ణా నాయక్‌, సునీత దంపతులు దినసరి కూలీలు. వారికి స్థానికుడు బాల్‌ రెడ్డితో స్థల వివాదం ఉంది. అదే స్థలంలో తాము నిర్మించుకున్న పునాదులను గురువారం సాయంత్రం కొందరు తొలగిస్తున్నారని చెప్పడంతో అక్కడకు వెళ్లినట్లు సునీత తెలిపారు. ఆ సమయంలో బాల్‌రెడ్డి, కుటుంబ సభ్యులు తనపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారన్నారు. అపస్మారకస్థితిలో పడిన తనను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి తన చెల్లెలు చికిత్స అందించిందన్నారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా, పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా, బాల్‌రెడ్డి ఫిర్యాదుమేరకు తనపై కేసు నమోదుచేశారని ఆరోపించారు. తనకు న్యాయం జరగకపోతే, సీఎం, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లి సాయం కోరతానని తెలిపారు

టిప్పర్‌ డ్రైవర్‌పై దాడి

మదనపల్లె : రాయచోటి నుంచి మదనపల్లెకు ఇసుక తీసుకుని వచ్చినందుకు టిప్పర్‌ డ్రైవర్‌పై మదనపల్లె టిప్పర్‌ అసోసియేషన్‌ సభ్యులు దాడి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. రాయచోటికి చెందిన సుబ్రహ్మణ్యం టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాజంపేట రీచ్‌ నుంచి ఇసుక లోడ్‌ చేసుకుని, మదనపల్లెలో అన్‌లోడ్‌ చేసి తిరిగి రాయచోటికి వెళుతున్నాడు. చౌడేశ్వరి సర్కిల్‌ వద్ద అసోసియేషన్‌ సభ్యులు బిల్డప్‌ భరత్‌, పీఎస్‌ఆర్‌.ప్రసాద్‌రెడ్డి, అంకిశెట్టిపల్లె రమేష్‌, మణి, గొల్లపల్లెశివ, ముబారక్‌బాషా, ఏఎన్‌ఎస్‌ అమర తదితరులు బండిని అడ్డుకుని తాళాలు లాక్కోవడమే గాక, తనపై దాడిచేసి, చొక్కాను చించివేసి గాయపరిచారన్నారు. మదనపల్లెలో టిప్పర్‌ అసోసియేషన్‌ లారీలు తప్ప వేరెవ్వరూ తక్కువ ధరకు ఇసుక అమ్మరాదని, తాము రూ.24 వేలు అమ్ముతుంటే, నీవు రూ.18,500కు ఎలా దించుతావంటూ గదమాయిస్తూ విచక్షణారహితంగా కొట్టారన్నాడు. బాధితుడు టిప్పర్‌ను అక్కడే విడిచిపెట్టి, తెలిసిన వారి సహాయంతో టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, సీఐ రామచంద్రకు ఫిర్యాదు చేశాడు. దాడి ఘటనపై విచారణ చేసి కేసు నమోదుచేస్తామని తెలిపారు.

బొలెరో వాహనం ఢీకొని

వ్యక్తి మృతి

గుర్రంకొండ : బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని తరిగొండ వద్ద జరిగింది. మదనపల్లె రూరల్‌ మండలం సీటీఎంకు చెందిన సుబ్బమ్మగారి నాగరాజు(45) శుక్రవారం మండలంలోని తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చాడు. స్వామిని దర్శించుకుని తిరిగి ఆటోలో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో వాల్మీకిపురం వైపు వెళుతున్న బొలెరో వాహనం ఢీకొంది. వెనుక కూర్చున్న నాగరాజుకు తీవ్రరక్తగాయాలయ్యాయి. తిరుపతికి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా నాగరాజు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు.

ప్రమాదంలో భార్యాభర్తలు మృతి

మైదుకూరు : లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన భార్య, భర్తలు తిరిగిరాని లోకాలకు చేరారు. వారి కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నాడు. చాపాడు మండలం తప్పెట ఓబాయపల్లెకు చెందిన పసుపులేటి చలమయ్య పట్టణంలోని నంద్యాల రోడ్డు సీతారామాంజనేయనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి మల్లేష్‌, వినోద్‌ కుమార్‌ కుమారులు. చలమయ్య కేశలింగాయపల్లె వద్ద ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వినోద్‌ వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. శుక్రవారం భార్య, కుమారుడు వినోద్‌తో కలిసి చలమయ్య పొలానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లాలనిమైదుకూరు–పోరుమామిళ్ల రహదారిపైకి చేరుకొని ముగ్గురు ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మాచర్ల నుండి సిమెంట్‌ లోడుతో వస్తున్న లారీ వీరిపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో చలమయ్య (55), ఆయన భార్య లక్ష్మీదేవి (50) అక్కడికక్కడే మృతి చెందారు. వినోద్‌ కుమార్‌కు గాయాలవడంతో కడప రిమ్స్‌కు తరలించారు. అర్బన్‌ సీఐ హాసం పరిశీలించారు. వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ 1
1/2

ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ

ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ 2
2/2

ఆలయంలో మైక్‌ సెట్‌ చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement