
దోస రైతుకు నిరాశ
లక్ష రూపాయలు భూమిలో పోసిన రైతుకు ఏటా నిరాశే మిగులుతోంది. వేసవి కావడంతో దోస పంటకు మంచి డిమాండ్ ఉంటుందని కష్టపడి పండించిన అన్నదాతలు దళారుల మాయకు దిగాలు పడుతున్నారు. ఉన్నపాటుగా ధర భారీగా పతనమవడంతో దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు.
ఓబుళవారిపల్లె : వాణిజ్య పంటలకు పేరుగాంచిన రైల్వేకోడూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏటా 650 ఎకరాల్లో దోస పంట సాగు చేస్తారు. అప్పు తెచ్చి దుక్కులు చేసి పంట సాగు చేసిన రైతుకు తీరా దిగుబడి చేతికందే సమయంలో దళారుల చేతుల్లో నష్టపోతున్నారు. ఎగుమతి చేసే దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ ఏడాది పంట పండించిన రైతు కంటే దళారులే ధర నిర్ణయించడం పరిపాటిగా మారింది. రంజాన్ మాసం ముందుగానే రావడంతో దోస పంట చేతికందింది. ఈ సమయంలో మంచి ధర పలుకుతుందని రైతులు ఎంతో ఆశపడ్డారు.
ధర పతనం
దోస కాయల ధర మార్కెట్లో టన్నుకు రూ. 22 వేలు పలుకుతోంది. అయితే హోలీ పండగ అడ్డుపెటుకొని కొందరు దళారులు సిండికేట్గా మారి ఒకేసారి టన్నుపై రూ.7 వేలు తగ్గించేశారు. కోహినూర్ రకం దోస టన్ను రూ.54 వేలు ఉండగా, రూ.30 వేలకు పడిపోయింది. రైతు చేసేదేమీలేక.. చేతికందిన పంట వదిలేయలేక దళారులు చెప్పిన కాటికే అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. దోస పంట సాగుచేసినప్పటి నుంచి విత్తనం, ఎరువులు, కూలీలు, మందులు, మల్చింగ్ ఖర్చులు ఒక ఎత్తయితే.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట దిగుబడులు తీశాడు. ఎకరాకు లక్ష రూపాయల నుంచి రూ.1.20 లక్షలు ఖర్చు చేశారు. ఇపుడు చేతికందే సమయంలో ధరలేక దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకటేసారి టన్నుకు ఏడువేల రూపాయలు నుంచి తొమ్మిదివేల రూపాయల వరకు రైతు నష్టపోతున్నాడు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని దోస రైతులు కోరుతున్నారు.
వారం లోపు రూ.7 వేలు తగ్గింపు
దళారులు అందరూ సిండికేట్గా ఏర్పడి హోలీ పండగ పేరుతో దోస దిగుబడులు టన్నుకు రూ.7 వేలు తగ్గించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి పంట సాగు చేస్తే రైతులను మోసం చేసి దోచుకుంటున్నారు. దళారులపై చర్యలు తీసుకోవాలి.
– బండారు వెంకటరమణ, రైతు,
చెన్నరాజుపోడు, ఓబులవారిపల్లి మండలం
దళారులు కోట్లు సంపాదిస్తున్నారు
పంట చేతికేందే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయాను. ఏటా దళారుల చేతుల్లో మోసపోవాల్సి వస్తోంది. వారు నిర్ణయించిన సిండికేట్ ధరతో మేము పంట అమ్మాల్సి వస్తోంది. అధికారులు చర్యలు తీసుకొని రైతును కాపాడకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేం.
– నందలూరు వెంకటసుబ్బారెడ్డి, ఓబులవారిపల్లి
దళారుల సిండికేట్తో ధర తగ్గింపు
టన్నుకు ఏడు వేల రూపాయల నష్టం
ఈ ఏడాది మోసపోయిన రైతులు

దోస రైతుకు నిరాశ

దోస రైతుకు నిరాశ