సిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటంలోని శ్రీ రంగనాయకస్వామి ఆలయం వద్ద, భాకరాపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం సాయంత్రం మద్యం తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. సిద్దవటంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం వద్ద శ్రీనివాసులు అనే వ్యక్తిని, భాకరాపేటలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
కుక్కల దాడిలో జింక మృతి
ములకలచెరువు : కుక్కల దాడిలో ఒక కృష్ణ జింక మృతి చెందిన సంఘటన గురువారం మండలంలో జరిగింది. ఫారెస్టు అధికారుల కథనం మేరకు.. మండలంలోని కదిరినాథునికోట సమీపంలో మేత మేస్తున్న జింకల గుంపుపై కుక్కలు దాడికి యత్నించాయి. ఈ దాడిలో ఒక జింకను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. స్థానికంగా ఉన్న రైతులు గమనించి కుక్కల నుంచి జింకను కాపాడి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫారెస్టు అధికారులు చేరుకునే లోపే జింక మృతి చెందింది. అనంతరం వెటర్నరీ డాక్టర్తో పోస్టుమార్టం నిర్వహించి కనుగొండలో జింక కళేబరాన్ని ఖననం చేసినట్లు ఫారెస్టు అధికారి గోపాల్ పేర్కొన్నారు.