హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

Mar 14 2025 12:07 AM | Updated on Mar 14 2025 12:06 AM

– జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు

రాయచోటి : హోలి పండుగను సురక్షితం, సంతోషం, బాధ్యతతో ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పండుగ సందర్భంగా ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించరాదని ఎస్పీ సూచించారు. ఎలాంటి గొడవలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలన్నారు. పండుగ పేరుతో హద్దులు దాటితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎవరి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా హోలీ పండుగను కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. హోలీ పండుగ సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని తెలిపారు. చర్మానికి, పర్యావరణానికి హానికరం కాని సహజ రంగులను ఉపయోగించాలన్నారు.

వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు..

సామాజిక మాధ్యమాలలో వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు. తప్పుడు సమాచారాన్ని పంపినా, షేర్‌ చేసినా అలాంటి వారిమీద చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు సూచనలు వాటించి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం

పీలేరు : స్థానిక జగనన్న కాలనీలోని మూడో వీధిలో ప్రతిష్టించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృతతేజ ఈ చర్యను ఖండించారు. గురువారం ఈమేరకు పీలేరు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ప్రజల మనుషుల్లో నిలిచిన వ్యక్తి వైఎస్సార్‌ అని కొనియాడారు. అధికారులు స్పందించి వైఎస్సార్‌ విగ్రహం పునఃప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయిసంపత్‌కుమార్‌, సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ నిధులపై విచారణ

వీరబల్లి : మండలంలోని సానిపాయ పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయంటూ స్థానిక నాయకులు కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆర్‌డబ్ల్యుఎస్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి జాకప్‌ పాల్‌, ఏఈ విశ్వనాథ మంచినీటి పనులు, గ్రామాలలో ఏర్పాటు చేసిన నిధులపై గురువారం విచారణ జరిపారు. నిధుల రికార్డులను పరిశీలించారు. ఈ విషయంపై వారు మాట్లాడుతూ నిధులకు సంబంధించి రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత పూర్తి సమాచారం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ నేతి ఆంజనేయులు, పోలీస్‌ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

మదనపల్లె : గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 4 కిలోల గంజాయి సీజ్‌ చేసినట్లు టుటౌన్‌ సీఐ రామచంద్ర తెలిపారు. గురువారం ముందస్తుగా అందిన సమాచారం మేరకు న్యూబైపాస్‌రోడ్డు చంద్రకాలనీ క్రాస్‌ వద్ద బీకే పల్లి లక్ష్మినగర్‌కు చెందిన ఆవుల మునిరాజు(34), అతని భార్య ఆవుల సుజాత(28) అక్రమంగా గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి రూ.80 వేల నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.

కేబుల్‌ వైర్ల చోరీ కేసులో

ఇద్దరి అరెస్టు

నిమ్మనపల్లె : కేబుల్‌ వైర్ల చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 200 మీటర్ల కేబుల్‌ వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిందితుల వివరాలు తెలిపారు. ఇటీవల మండల పరిధిలో నిమ్మనపల్లె, తవళం, అగ్రహారం, సామకోటవారిపల్లె గ్రామాలలో పదుల సంఖ్యలో వ్యవసాయ బోర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్‌ వైర్లు చోరీ చేశారు. ఘటనపై బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ప్రత్యేక నిఘా ఉంచి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఎస్‌.చంద్రశేఖర్‌ (22), మదనపల్లె చంద్రాకాలనీకి చెందిన పి.నాగార్జున(20) కేబుల్‌ వైర్లను చోరీ చేస్తున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. గురువారం నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచామన్నారు.

హోలీ పండుగను  సంతోషంగా జరుపుకోవాలి   1
1/2

హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

హోలీ పండుగను  సంతోషంగా జరుపుకోవాలి   2
2/2

హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement