
చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
రాయచోటి టౌన్/ రాయచోటి జగదాంబసెంటర్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాలను విస్తృత్తంగా నిర్వహించి చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సూచించారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర,, పీ4 సర్వే, గృహ నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై వివిధశాఖ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం జరుగుతుందని, జిల్లాకు సంబంధించిన లక్ష్యాలను 20వ తేదీలోగా పూర్తి చేయాలని తెలిపారు.గృహ నిర్మాణాల్లో ప్రగతి సాధించాలని తెలిపారు. పీ4, వర్క్ ఫ్రం హోం, సర్వేలు, పక్కాగా చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజలనుంచి అందిన అర్జీలను త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతి మండలంలో కంప్రెసెడ్ బయో గ్యాస్, విద్యుత్ సబ్ స్టేసన్ల వద్ద సోలార్ విద్యుత్ ఫ్లాంట్ ఏర్పాటు కోసం భూములు గుర్తించి నివేదిక పంపాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్స్ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
● ఎన్టీఆర్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా ఇంటి నిర్మాణంలో పూర్తిగా కాకుండా నిర్మాణదశలో ఉన్న ఇళ్లకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు అదనపు ఆర్థికసాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్టీ వర్గానికి చెందిన వారికి రూ.75 వేలు, ఎస్సీ, బీసీ వర్గాల వారికి రూ.50 వేలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థికసాయం మొత్తాన్ని వివిధ దశల్లో అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో దాదాపు 19672 మందికి వంద కోట్ల రూపాయల అదనపు ఆర్థికసాయం అందుతుందని తెలిపారు. హౌసింగ్ శాఖ పీడీ సాంబశివయ్య పాల్గొన్నారు.
● జిల్లా ఆర్థికాభివృద్ధిలో బ్యాంకర్ల భాగస్వామ్యం ఎంతో కీలకమని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. గురువారం కలెక్టరేట్ చాంబర్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం డిసెంబర్ 31 నాటికి క్రిడెట్ ప్లాన్ లక్ష్యం రూ.10,290 కోట్లకు రూ.13,544 కోట్ల రుణాలు మంజూరు చేసి 131.62 శాతం, ప్రాధాన్యత రంగంలో రూ.8,804 కోట్లకు రూ.10,929 కోట్లు మంజూరు చేసి 124.31 శాతం, వ్యవసాయ రంగంలో రూ. 7,573 కోట్లకు రూ. 9,741 కోట్లు మంజూరు చేసి 132 శాతం ఆర్థిక ప్రగతి సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జి. ఆంజనేయులు, ఏఎల్డీఎం వన్నూర్బాషా. ఎస్బీఐ నాబార్డు ఏజీఎం విజయ్ విహారి. ఆర్బీఐ ఎల్డీఎం రోహిత్ అగర్వాల్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి