
కూటమి కక్ష.. విద్యార్థులకు శిక్ష
బి.కొత్తకోట: మదనపల్లె ప్రాంత విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలన్న సదుద్దేశంతో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి పదేళ్లు కేంద్రంతో పోరాడి సాధించిన ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం తరగతులు ఈ ఏడాది ప్రారంభం కాకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. విద్యార్థులతో కూటమి ప్రభుత్వం చెలగాటం అడేందుకు సిద్ధమైపోయింది. పలు కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా మదనపల్లె కేంద్రీయ విద్యాలయం విషయంలో మాత్రం కక్ష కట్టారు. అత్యంత ప్రతిష్టాత్మక విద్యాలయం ఏర్పాటు చేయడంపై సహకరించాల్సిన ప్రభుత్వం ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం అడుతోంది. సీబీఎస్ఈ విద్యను అందించే ఈ కేంద్రంలో ఒకటి నుంచి ప్ల్స్ టూ వరకు విద్యను బోధిస్తారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)లాంటి సంస్థల సహకారంతో విద్యలో ప్రయోగాలు చేపట్టి నూతన ఆవిష్కరణలతో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ఇలాంటి విద్యాలయానికి నోటిఫికేషన్ రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు సిద్ధం
మదనపల్లెలో 2025–26 విద్యాససంవత్సరంలో కేంద్రీయ విద్యాలయంలో తరగతుల ప్రారంభం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ ఏడాదే తరగతులు ప్రారంభమయ్యేలా స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ భవనాలను అభివృద్ధి చేయించారు. గదులు, భవన ఆధునీకరణ పనుల కోసం ఎంపీ మిథున్రెడ్డి ఎంపీల్యాడ్స్ నుంచి రూ.40 లక్షలు మంజూరు చేసి పనులు చేయించారు. అన్ని వసతులతో భవనం రూపుదిద్దుకొంది. గ్రౌండ్, పైన ఫ్లోర్లు సిద్ధం చేశారు. తరగతులు, కార్యాలయ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.దీంతో మదనపల్లె ప్రాంత విద్యార్థులు విద్యాలయంలో చేరికకు ఆసక్తి చూపుతున్నారు. కాగా శాశ్వత భవనాల నిర్మాణం కోసం పుంగనూరు రహదారిలోని వలసపల్లె వద్ద 6.09 ఎకరాల భూమికి కేటాయించారు. నవోదయ విద్యాలయానికి సమీపంలోనే ఈ కేంద్రీయ విద్యాలయం ఉంటుంది.
మరమ్మతుల పేరుతో అడ్డంకులు
కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి అంతా సిద్ధమైనప్పటికి చిన్నపాటి మరమ్మతు పనుల పేరిట నోటీఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటివల కేంద్రీయ విద్యాలయాలకు చెందిన దక్షిణ భారత జోన్ ఇన్చార్జి కేవి.సంఘటన్ బృందం వసతులు, ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ బృందం వెళ్లి రోజులు గడుస్తున్నా ఇంకా పనుల పేరిట జాప్యం చేస్తుండటం చూస్తుంటే కావాలనే నోటిఫికేషన్ జారీ కాకుండా ఆడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి అడ్మషన్ల ప్రక్రియ మొదలవుతుంది..ఈలోగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయితే మదనపల్లెకు నోటిఫికేషన్పై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
మిథున్రెడ్డికి పేరు వస్తుందని...
రాజంపేట ఎంపీగా హ్యట్రిక్ సాధించిన మిథున్రెడ్డి మదనపల్లెను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను మంజూరు చేయించడమే కాకుండా చారిత్రిక బీటీ కళాశాలను విశ్వవిద్యాలయంగా చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయించారు. విద్యార్థుల సమస్యలు, విద్యాభివృద్ధికి గత ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేశారు. అలాగే పదేళ్లుగా మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయించి విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమైతే మదనపల్లె విద్యా చరిత్రలో కలికితురాయిగా మిగిలిపోతుంది. ఈ ఘనత మిథున్రెడ్డికి దక్కుతుందన్న అక్కసుతో ప్రభుత్వం తరగతులను ప్రారంభించేందుకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించే నోటిఫికేషన్కు అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది.
మదనపల్లె కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం కాకుండా అడ్డంకులు
భవనం సిద్ధమైనా మరమ్మతుల పేరుతో జాప్యం
ఎంపీ మిథున్రెడ్డి ప్రతిష్ట పెరుగుతుందని అక్కసు
విద్యార్థులకు అండగా ఉంటాం
పేద విద్యార్థులకు విద్యే భవిష్యత్తు, వారికి ఉన్నతమైన విద్యను అందించేందుకు అండగా ఉంటాం. మదనపల్లెను విద్యపరంగా అగ్రగామిగా నిలపాలన్నదే ఆశయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మదనపల్లెలో విద్య కేంద్రాలను మంజూరు చేయించాం. విద్యార్థులకు నష్టం కలగకుండా ఈ ఏడాదే తరగతులు ప్రారంభించాలని కోరుతున్నాం. వైద్యపరంగా పేదలకు మెరుగైన సేవల కోసం మెడికల్ కళాశాలను కూడా మంజూరు చేయించాం. విద్య, వైద్యం అభివృద్ధికి కృషి చేస్తాం.
–పీవీ.మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ

కూటమి కక్ష.. విద్యార్థులకు శిక్ష