గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన బుధవారం ఉదయాన్నే రథారోహణం నిర్వహించారు. ఆలయంలోని స్వామివార్లను స్థానిక బస్టాండు కూడలిలోని స్వామివారి తేరు(రథం) వద్దకు తీసుకొచ్చి అందులో కొలువుదీర్చారు. ఆలయంలో ధూళీ ఉత్సవం నిర్వహించారు. రంగురంగుల పుష్పాలతో స్వామివారి రథాన్ని అందంగా అలంకరించారు. అనంతరం హరినామస్మరణ, గోవింద సంకీర్తనలు నడుమ రథోత్సవం సాగింది. స్వామివారి రథోత్సవానికి అడుగడుగునా ప్రజలు, భక్తులు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు గ్రామానికి చేరుకొని గోవిందా, గోవిందా ఆంటూ భక్తి తన్మయత్వంతో స్వామివారి రథాన్ని లాగారు. రథోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. పలువురు అన్నదానం నిర్వహించారు. మేళతాళాలు, కోలాటాలు, టీటీడీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో రథోత్సవం పురవీధుల గుండా వైభవంగా సాగింది. మంగళవారం రాత్రి స్వామివారి తిరునాల ఘనంగా నిర్వహించారు. తరిగొండతో పాటు పరిసర గ్రామాల ప్రజలు చాందినీ బండ్లు, అన్నం, టెంకాయ బండ్లు ఆలయం చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఆలయంలో నేడు..
మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన గురువారం సూర్యప్రభ వాహనం, ఊంజల్సేవ, చంద్రప్రభ వాహనం, పార్వేట ఉత్సవం, అశ్వవాహనం కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు గోపాల బట్టార్ తెలిపారు.