రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణం రంగనాయకులపేటకు కొల్లా శ్రీనివాసులు (38) కువైట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా.. కష్టాలు, అప్పుల బాధలు తట్టుకోలేక సూరపురాజుపల్లిలో ఉన్న సొంత ఇంటిని అమ్మేసి భార్యా భర్తలు ఇరువురూ జీవనోపాధికి కువైట్కు వెళ్లారు. అయినప్పటికీ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య అన్నపూర్ణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబమంతా రోడ్డున పడింది.
రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : కుటుంబ సమస్యలతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం కురబలకోట మండలంలో జరిగింది. సింగన్నగారిపల్లెకు చెందిన రైతు ఆంజనేయులు(45) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడి పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
కారు ఢీకొని
పాదయాత్రికుడి దుర్మరణం
పుల్లంపేట : తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొనడంతో మృతి చెందిన సంఘటన బుధవారం పుల్లంపేట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం అనిమెల గ్రామానికి చెందిన కొందరు తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. రెడ్డిపల్లి చెరువుకట్ట వద్దకు రాగానే రైల్వేకోడూరుకు చెందిన కారు పాదయాత్రికునిపై దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో చాట్ల కొండయ్య (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మల్లేల వెంకటేష్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తెలిపారు.
మద్యం విక్రయంపై కేసు నమోదు
పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులోని ఓ రేకుల షెడ్డులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. బుధవారం షెడ్డులో ఎనిమిది క్వార్టర్ బాటిళ్లతో పాటు పట్టుబడిన గూని రమేష్ (31) అనే నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
రెండు లారీలు ఢీ
ఓబులవారిపల్లె : ముక్కావారిపల్లె జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఎదురెదురుగా రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆయిల్ ట్యాంకర్ లారీలో ఉత్తరప్రదేశ్కు చెందిన రామ్ జనక్ పటేల్ చిక్కుకు పోయాడు. స్టీరింగ్ సందులో ఇరుక్కుపోవడంతో బయటకు రాలేకపోయాడు. ఎస్ఐ మహేష్ నాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో లారీలను తొలగించి లారీలో ఇరుక్కుపోయిన వ్యక్తిని బయటకు తీసి 108 వాహనంలో తిరుపతికి తరలించారు. రెండు లారీలు వేగంగా రావడంతో మలుపు వద్ద అదుపు చేయలేక ఢీ కొన్నాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలానికి చేరుకొని వాహనాలను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
కువైట్లో కోడూరు వాసి ఆత్మహత్య