ములకలచెరువు : మండల కేంద్రంలో లభ్యమైన ఆడ శిశువును రాయచోటి శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించామని ఐసీడీఎస్ సూపర్వైజర్ మంజుల బుధవారం తెలిపారు. చిన్నారికి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అక్కడి నుంచి రాయచోటికి ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి కేంద్రంలోని సంరక్షకులకు అప్పగించామన్నారు. పాప ఆరోగ్యంగా ఉన్నట్లు వివరించారు.
సంబంధీకులు సంప్రదించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా మొలకలచెరువు ఉమాశంకర్కాలనీ ఆదర్శ పాఠశాల వద్ద గుట్టలో బ్యాగులో ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లినట్లు జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారిణి పి.రమాదేవి తెలిపారు. బుధవారం ఆమె రాయచోటిలో మాట్లాడుతూ 3 నుంచి 5 రోజుల ఆడ శిశువును మొలకలచెరువు ఆదర్శ పాఠశాల వద్ద వదిలి వెళ్లిపోయారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసు, ఐసీడీఎస్ అధికారులు చిన్నారిని శిశుగృహంలో ఉంచారన్నారు. తల్లిదండ్రులు, సంబంధీకులు పాపను గుర్తించేందుకు తగిన ఆధారాలతో 30 రోజుల్లోగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి వారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. లేని పక్షంలో ఈ పాపను అనాథగా ప్రకటించి, ప్రభుత్వ షరతులు, నియమాల ప్రకారం మరొకరికి దత్తత ఇస్తామని ఆమె వివరించారు.
నిధుల ఖర్చుపై విచారణ
వీరబల్లి : వంగిమల్ల పంచాయతీలోని గ్రామాలలో తాగునీటికోసం ఖర్చుచేసిన నిధులపై బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. క్వాలిటీ కంట్రోల్ డీఈఈ జాకప్ పాల్, అసిస్టెంట్ ఇంజినీర్ విశ్వనాథన్లు ఈ విచారణ జరిపారు. 14, 15వ ఫైనాన్స్ నిధులతో ఖర్చుచేసిన పనులను, సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గతంలో పనిచేసిన ఆర్డబ్ల్యుఎస్ ఏఈ కృష్ణయ్య, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, స్థానిక గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులో ఇద్దరి అరెస్టు
సంబేపల్లె : హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని నారాయణరెడ్డి గ్రామంలో ఇటీవల వారాధి అనే వ్యక్తి హత్యకు గురయ్యాడన్నారు. పోలీసులు విచారణ చేపట్టడంతో వాస్తవాలు బయటి వచ్చాయని తెలిపారు. అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ, ఆనంద్రెడ్డిలు ఓ కాంట్రాక్ట్ పని విషయమై వారాధితో గొడవపడ్డారన్నారు. దీంతో పథకం ప్రకారం వారాధి నిద్రిస్తున్న సమయంలో బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసుల విచారణలో తేలిందన్నారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తప్పిన పెను ప్రమాదం
సిద్దవటం : మాచుపల్లె– కడప రహదారి బండికనుమ సమీపంలో లింగంపల్లె గ్రామం నుంచి కడప వైపు బుధవారం లారీలో ఇటాచ్ యంత్రాన్ని తీసుకెళుతుండగా విద్యుత్ వైర్లు తెగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వివిధ పనులపై జిల్లా కేంద్రానికి ఆ రహదారిపై ప్రయాణిస్తుంటారు. విద్యుత్ వైర్లు తెగిపడి, విద్యుత్ స్తంభం ఒరిగి, మామిడి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయమై సిద్దవటం ట్రాన్స్కో ఏఈ జయచంద్రను వివరణ కోరగా లింగంపల్లె గ్రామం నుంచి లారీలో ఇటాచ్ యంత్రాన్ని కడపకు తీసుకెళుతుండగా విద్యుత్ వైర్లు తగులుకొని తెగిపోయాయన్నారు.ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని లారీ యజమానిపై కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.
కాలిపోయిన గుర్రంకొండ
గుర్రంకొండ : చరిత్రాత్మక గుర్రంకొండ కొండ కాలిబూడిదైంది. ఈ కొండలోనే చరిత్రాత్మక కట్టడాలతో పాటు పురాతన భవనాలు, కోటగోడలు ఉన్నాయి. సుమారు 500 ఎకరాల్లో గుర్రంకొండ కొండ విస్తరించి ఉంది. గత రాత్రి గుర్తుతెలియని దుండుగులు కొండకు వెనుకవైపు నిప్పు అంటించారు. దీంతో కొండలు సగానికిపైగా కాలిబూడిదయ్యాయి. కొండ ముందు భాగంలో ఉన్న కోటగోడలు, కొండపైభాగం వరకు మంటలు వ్యాపించాయి. దీంతో చెట్లు మొత్తం కాలిపోయాయి. మంటల్లో చిక్కుకొని అడవి జంతువులు, పక్షులు, అగ్నికి ఆహుతి అయ్యాయి. గత కొన్ని రోజులుగా దుండుగులు కొండలు, గుట్టలకు నిప్పు పెడుతున్నారు.
సంరక్షణ కేంద్రానికి చిన్నారి అప్పగింత
సంరక్షణ కేంద్రానికి చిన్నారి అప్పగింత
సంరక్షణ కేంద్రానికి చిన్నారి అప్పగింత