గురు సన్నిధి.. ఆధ్యాత్మిక పెన్నిధి | - | Sakshi
Sakshi News home page

గురు సన్నిధి.. ఆధ్యాత్మిక పెన్నిధి

Mar 13 2025 12:38 AM | Updated on Mar 13 2025 12:37 AM

రామాపురం : ఆరు దశాబ్దాల క్రితం నిర్జీవంగా ఉండి సమాధుల చుట్టూ గోడలు ఉండే ప్రదేశం నేడు ఎందరో భక్తులకు మానసిక ఉల్లాసం కలిగిస్తూ, వారి కోర్కెలు తీర్చే ఆలయంగా మారింది నీలకంట్రావుపేట దర్గా.

ఆరు దశాబ్దాల క్రితం అదో నిర్జన ప్రదేశం. అందులో రెండు సమాధులు, చుట్టూ గోడలు, సాయంత్రం వేళల్లో ఫకీరులు పక్క గ్రామమైన నీలకంట్రావుపేట, చుట్టు పక్కల గ్రామాల్లో భిక్షమడిగి తెచ్చుకుని అక్కడే తిని, అక్కడే బస చేస్తుండేవారు. దర్గా అని పిలువబడే ఇక్కడికి భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుని వెళుతుండేవారు. ఈ దర్గా అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నీలకంట్రావుపేట సమీపంలో దక్షిణ దిశగా ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ఏటా ఘనంగా దర్గా ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.

దర్గా సంక్షిప్త చరిత్ర..

హిందూ, ముస్లిం సమైక్యతకు ప్రతీకగా ఓ పవిత్ర దర్శనీయ స్థలంగా నేడు ఈ దర్గా వెలుగొందుతోంది. కడప –చిత్తూరు ప్రధాన జాతీయ రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ దర్గాలో ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా ఉరుసు ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుపుతారు. సద్గురు హజరత్‌ దర్బార్‌ వలీ అలీషా వలీ, రహంతుల్లా అలైహి బాబా, శ్రీ జలీల్‌ మస్తాన్‌వలీ గార్ల ఉరుసు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కనుల పండువగా జరుగుతాయి. అత్యంత మహత్యం కలిగిన ఈ ప్రదేశం శివత్వమని, శివైక్యం పొందిన దర్బారు నగరు పీఠాధిపతి గురువు సద్గురు దర్గాస్వామీజీ తెలిపారు. దత్త పీఠానికి చెందిన మహాపూర్ణత్వ పురుషులైన హజరత్‌ దర్బారు అలీషావలీ 147 వ సంవత్సరంలో ఈ నిర్జన స్థలంలో సజీవ సమాధిగా సిద్ధి పొందారని స్వామీజీ వివరించారు. అప్పటి అరేబియా దేశస్తులైన హజరత్‌ దర్బారు షావలి తన భారత దేశ యాత్ర సందర్భంగా ఈ నిర్జన ప్రదేశ విశేష మహత్యానికి తపోసిద్ధి పొంది ఇక్కడ సమాధి పొందారు.

దర్గా దర్బారులో సాయి మందిరం, విద్యాలయం..

ఇదే ఆశ్రమ సన్నిధిలోనే షిర్డీ సాయినాథుని పంచలోహ విరాట్‌ విగ్రహంతో కూడిన మందిరం నిర్మించారు. అలాగే పంచలోహ ఉత్సవ విగ్రహం కూడా ఉంది. అలాగే 1–10వ తరగతి వరకు సుందరమైన భవనాలలో తరగతి గదులు, ప్రార్థనా మందిరం ఇక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ ఒక పూట ఉచిత భోజనంతో కూడిన విద్యాదానం చేస్తున్నారు.

మాతాజీ మందిరం..

స్వామీజీకి అహర్నిశలు చేదోడువాదోడుగా ఉండి అంతా తానై వచ్చే భక్తులను ఎంతో ఆప్యాయత అనురాగాలతో ప్రేమగా పలకరించే ఆయన అర్ధాంగి రంగనాయకమ్మ తుదిశ్వాస వదిలారు. అక్కడికి వచ్చే భక్తులందరూ అమ్మ అంటూ మాతృమూర్తి సమాధి దర్గాలో ఏర్పాటు చేసి నిత్యం ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఉరుసు ఉత్సవం..

సద్గురు హజరత్‌ దర్బార్‌ అలీషావలి, రహంతుల్లా అలైబాబా జలీల్‌ మస్తాన్‌ వలీ బాబా గార్ల ఉరుసు ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గంధమహోత్సవం, 14న శుక్రవారం జెండా మెరవణి , ఉరుసు, రాత్రి హిందూ, మహమ్మదీయ సోదరుల సహకారంతో బ్రహ్మాండమైన వాయిద్యాల నడుమ బెంగళూరుకు చెందిన అస్మా నిఖత్‌, నాగపూర్‌కు చెందిన సలీం సైదాలతో గొప్ప ఖవాలీ పోటీ ఉంటుంది. 15న తహలీల్‌ ప్రసాదం అందించడంతో ఉత్సవం ముగుస్తుంది.

హిందూ, ముస్లిం సమైక్యతకు ప్రతీక నీలకంట్రావుపేట దర్గా

నేటి నుంచి ఉరుసు ప్రారంభం

గురు సన్నిధి.. ఆధ్యాత్మిక పెన్నిధి 1
1/1

గురు సన్నిధి.. ఆధ్యాత్మిక పెన్నిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement