రామాపురం : మండల పరిధిలోని నీలకంట్రావుపేట పంచాయతీ సమీపంలో సద్గురు సాయి దర్బార్ నగర్లో వెలసిన సద్గురు హజరత్ దర్బార్ అలీషా వలీ, రహమతుల్లా అలై బాబా, జలీల్ మస్తాన్ వలీ బాబా ఉరుసు ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని తహసీల్దార్ రామాంజనేయులు, లక్కిరెడ్డిపల్లె సీఐ కొండారెడ్డి, ఎస్ఐ వెంకటసుధాకర్రెడ్డిలు తెలిపారు. ఉత్సవాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 13న గంధం, 14న ఉరుసు ఉత్సవాలు, రాత్రికి బెంగళూరుకు చెందిన అస్మా నిఖిత్ ఖవ్వాలి, అలాగే నాగపూర్కు చెందిన సలీం షైదా ఖవ్వాలి నిర్వహించనున్నారు. 15న తీర్థ ప్రసాదాలతో ఉరుసు ముగుస్తుందన్నారు. ఉరుసు ఉత్సవాలను హిందూ ముస్లిం ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు.
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
కలసపాడు : కలసపాడు మండలంలోని పెండ్లిమర్రి వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న భార్గవి సోమవారం రాత్రి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలికను చికిత్స నిమిత్తం సిబ్బంది పోరుమామిళ్లలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి కడప రిమ్స్కు, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్కు తరలించారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపల్ రెడ్డిజ్యోతిని వివరణ కోరగా విద్యార్థిని ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి కింద పడిందని, వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేసి పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు.
దాడి ఘటనలో కేసు నమోదు
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలో పులివెందుల రోడ్డు సాక్షి సర్కిల్ సమీపంలో ఈనెల 10వ తేదీన పాతసామాన్ల అంగడిని నిర్వహిస్తున్న విక్రమ్ వద్దకు మాట్లాడేందుకు మల్లికార్జున అనే వ్యక్తి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కిషోర్, ప్రకాష్, ఇంకా ముగ్గురు మల్లికార్జునను ఎగతాళి చేశారు. దీంతో ఈ విషయాన్ని మల్లికార్జున తన సోదరుడు, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి మద్దిలేటికి తెలియజేశాడు. మద్దిలేటి వారిని అడిగేందుకు సంఘటన స్థలానికి వెళ్లగా వారు మద్దిలేటి, అతని సోదరుడు మల్లికార్జునపై దాడి చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కడప తాలూకా ఎస్ఐ తాహీర్హుసేన్ కేసు నమోదు చేశారు.
ప్రశాంతంగా ఉరుసు నిర్వహించాలి