● అంతర్ జిల్లాల పేకాటకు అడ్డాగా రాయచోటి
● జోరుగా జూద స్థావరాలు
● నిర్వాహకులకు కొందరు ఖాకీల సహకారం
● పోలీసుల అదుపులో ప్రధాన గ్యాంబ్లర్
● ఎస్పీ విచారణలో గుట్టు రట్టు
టాస్క్ ఫోర్స్: అధికారమే అండగా.. శిక్షించాల్సిన రక్షక భటులే అసాంఘిక కార్యకలాపాలకు రక్షణగా ఉండటంతో.. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పేకాట స్థావరాలకు అడ్డాగా మారింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన జూదరులకు జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాలు వేదికలయ్యాయి. మొబైల్ పేకాట, స్థానికంగా ఉన్న తోటలు, గుట్టల్లో రోజూ కోట్ల రూపాయలు చేతులు మారే జూదం నడుస్తోంది. కొందరు పోలీసులు, ఉన్నతాధికారులు.. నిర్వాహకులు అందించే మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కో ఆట నిర్వహణకు ముడుపుల రూపంలో లక్ష రూపాయలు ముడుతున్నట్లు ప్రచారం ఉంది. ఇలా రోజుకు రెండు, మూడు క్యాంపులు నిర్వహించి.. అంతే మొత్తంలో గ్యాంబర్లు అశోక్రెడ్డి, నర్సరీ రమణ మరికొందరి నుంచి ఓ కానిస్టేబుల్, హోంగార్డు ద్వారా కొందరు పోలీసు అధికారులకు అందుతున్నట్లు తెలియవచ్చింది. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నా రాయచోటి కేంద్రంగా అధికంగా కనిపిస్తోంది. దీంతో ఎస్పీ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
స్పెషల్ పార్టీ పోలీసుల దాడులు
జిల్లా వ్యాప్తంగా ఎస్పీకి అనుబంధ శాఖలు, వేగుల నుంచి అందుతున్న సమాచారం మేరకు నేరుగా స్పెషల్ పార్టీ పోలీసులతో పేకాట స్థావరాలపై దాడులు చేస్తూ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. దాడుల సమయంలో జూదరులు అందిస్తున్న సమాచారం మేరకు.. పోలీస్ శాఖ పరిధిలోని ఇంటి దొంగల పేర్లు బయటకు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక కానిస్టేబుల్, హోంగార్డు, ఒక డబుల్, త్రిబుల్ స్టార్ల అధికారుల పేర్లు కూడా ఆధారాలతో సహా రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
అందుపులో అంతర్ జిల్లా గ్యాంబ్లర్
అన్నమయ్య జిల్లా కేంద్రంగా పేకాట పక్క జిల్లాలు, ప్రాంతాల నుంచి జూదరులను సేకరించే గ్యాంబ్లర్ అశోక్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాయచోటి సమీపంలో రెండు రోజుల క్రితం పేకాట స్థావరంపై దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దాడి చేసిన సమయంలో మరో ఐదుగురు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నట్లు సమాచారం. వారిలో ప్రధానంగా గ్యాంబర్లు అశోక్ రెడ్డి, నర్సరీ రమణ, కానిస్టేబుల్ కోసం ఎస్పీ పార్టీ వలపన్నగా.. అశోక్రెడ్డి చిక్కినట్లు తెలుస్తోంది. అశోక్రెడ్డి ద్వారా జాదరులకు సహకరిస్తున్న పోలీసులు, పోలీసు అధికారుల వివరాలను రాబడుతున్నట్లు తెలియవచ్చింది. గ్యాంబర్ల నుంచి డబ్బుల చేరవేతలో మధ్యవర్తిగా ఉన్న హోంగార్డును కూడా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి తొలగించి ఎస్పీ కార్యాలయానికి అటాచ్మెంట్ చేసినట్లు వినికిడి.