
ప్రొద్దుటూరు క్రైం : వారిది సామాన్య కుటుంబం. పనికి వెళ్తే గానీ రోజు గడవని పరిస్థితి. పని చేసుకుంటూ భార్యాభర్తలు సంతోషంగా ఉండేవారు. దేవుడు వారికి సంతానం ఇచ్చినా.. సంతోషమనేది లేదు. పోలియో సోకి ఒక కుమారుడు మంచానికి పరిమితమైతే.. మరో కుమారుడి గుండెకు రంధ్రాలు పడ్డాయి. పిల్లల ఆరోగ్యంపై బెంగ పెట్టుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన భార్య, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరులోని నడింపల్లెకు చెందిన పోతినేని ప్రసాద్(32) ఆటో నడుపుకొని జీవనం సాగించేవాడు.
ఆయనకు భార్య అనితతోపాటు శివసుశాంత్ (8), వెంకటదినేశ్వర్ (6) అనే కుమారులు, అఖిలేశ్వరి (3) అనే కుమార్తె ఉన్నారు. అతను ఆటో నడపడంతో పాటు లారీ డ్రైవర్గా వెళ్తుంటాడు. ఆటోకు బాడుగలు సరిగా ఉండటం లేదని అందువల్ల లారీకి వెళ్తానని ప్రసాద్ ఇటీవల భార్యకు చెప్పాడు. అందుకు ఆమె నీ ఇష్టం అని చెప్పింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో లారీకి వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
భర్త లారీకి వెళ్తున్నాడేమోనని భార్య అనిత భావించింది. ఈ క్రమంలో శనివారం రాత్రి 11.50 సమయంలో ప్రసాద్ తన తల్లి రమణమ్మకు ఫోన్ చేసి ‘అమ్మా..! నేను బయట ఉన్నాను జాగ్రత్త’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత తల్లి, భార్య అతనికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7.20 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఫోన్ చేసి పట్టణ శివారులోని ఆటోనగర్ పక్కన ఉన్న ఫ్లాట్లలో ప్రసాద్ ఉరేసుకొని మృతి చెందాడని చెప్పారు. దీంతో భార్య, కుటుంబ సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లగా ప్రసాద్ ఒక చెట్టుకు చీర చుట్టుకొని ఉరేసుకొని ఉన్నాడు.
నా పిల్లలకు దేవుడు ఎందుకిలా చేశాడు..
కుమారుల ఆరోగ్య పరిస్థితి చూసి ప్రసాద్ దంపతులు మనోవేదనకు గురయ్యేవారు. పెద్ద కుమారుడు శివసుశాంత్కు పుట్టుకతోనే పోలియో సోకడంతో కాళ్లు, చేతులు సచ్చు బడ్డాయి. అంతేగాక అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో సుశాంత్ మంచానికి పరిమితయ్యాడు. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా బాబు ఆరోగ్యం నయం కాాలేదు. మరో కుమారుడు వెంకటదినేశ్వర్కు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇటీవలే ఆస్పత్రిలో చూపించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెకు రంధ్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రసాద్, అనితలు ఆదోళన చెందసాగారు.
‘నా పిల్లలకే ఎందుకు దేవుడు ఇలా చేశాడు.. ఈ బాధ చూడటం కంటే చావడం మంచిది’ అని ప్రసాద్ ఇంట్లో చెబుతూ బాధ పడేవాడు. అలా మాట్లాడవద్దని ఎంత డబ్బైనా సుశాంత్ను ఆస్పత్రిలో చూపిద్దాంలే అని భార్య, ప్రసాద్ తల్లి రమణమ్మ ధైర్యం చెబుతూ వచ్చేవారు. ‘ఆస్పత్రికి వెళ్లాలనుకునే లోపే నా భర్త ఇంత ఘోరానికి పాల్పడ్డాడని’ భార్య రోదించసాగింది. ముగ్గురు పిల్లలను ఎలా పోషించుకోవాలి దేవుడా అంటూ ఆమె విలపిస్తోంది. రూరల్ ఎస్ఐ చిరంజీవి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.