విశాఖపట్నం: సామాన్య ప్రజలకు మేలు జరగలేనప్పుడు, ఒక పార్టీని ఓడించేందుకు మూడు పార్టీలు కలిసి రావడంలో ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తూ నగరంలో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి.‘సంఘమిత్ర సోషల్ సర్వీసెస్’ పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన పార్టీలే చేతులు కలపడం ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశాన్ని ప్రభావితం చేస్తున్న 11 ప్రధాన సమస్యలను కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ మూడు పార్టీలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్కో పార్టీ ఒక్క సమస్యనైనా పరిష్కరించి చూపించాలని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.


