స్పృహ కోల్పోయిన కసినేని రామానుజులమ్మ
మారణాయుధాలతో చెలరేగిన పచ్చగూండాలు
మాధవరం గురికానివాండ్లపల్లెపై దాడి
దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టి భీతావహం
పోలీసుల సమక్షంలోనే దాడులు
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాధవరం గురికానివాండ్లపల్లెలో టీడీపీ మంత్రి రాంప్రసాద్ అనుచరులు మరో రాక్షస కాండ సాగించారు. మారణాయుధాలతో చెలరేగిపోయారు. కట్టెలు, రాడ్లు, రాళ్లు, మందుబాటిళ్లతో దాడులు చేశారు. నివాస గృహాల్లో పిల్లలు, పెద్దలు, మహిళలు అన్న తేడా లేకుండా దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో 20 మందికిపైగా గ్రామస్తులు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన గ్రామంలో యుద్ధవాతావరణాన్ని తలపించింది.
సేకరించిన వివరాల ప్రకారం.. గురికానివాండ్లపల్లెకు 2023లో అంగన్వాడీ కేంద్రం మంజూరైంది. అయితే స్థానికంగా ఉన్న ఒకరు కోర్టుకు వెళ్లి స్టే తేవడంతో అప్పట్లో నిర్మాణ పనులు ఆగిపోయాయి. తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మించిన పునాదులను పెకలించేందుకు మంత్రి అనుచరులు యత్నిస్తున్నారు. దీనిలోభాగంగానే మంత్రి అనుచరులు జేసీబీతో ఆదివారం ఆ గ్రామానికి వచ్చారు. పునాదులు పెకలించేందుకు యత్నించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో మంత్రి అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
వెంటనే రాయచోటి నుంచి 20 వాహనాల్లో పచ్చ గూండాలు భారీగా గ్రామానికి చేరుకుని గ్రామస్తులపై దాడులకు తెగబడ్డారు. మారణాయుధాలతో స్వైరవిహారం చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు చేష్టలుడిగి చోద్యం చూస్తుండిపోయారు. కనీసం నిలువరించకుండా ప్రేక్షకపాత్ర పోషించారు. దాడుల్లో బాలినేని మనోజ్ తలకు బలమైన గాయాలయ్యాయి. కసినేని రామానుజులమ్మ స్పృహతప్పి పడిపోయారు. చంటిబిడ్డ తల్లి రెడ్డిరాణి తీవ్రంగా గాయపడ్డారు. పెయింటర్ మల్లికార్జున, అనారోగ్యంతో మంచాన ఉన్న వృద్ధుడు రామదాసుతోపాటు మరో 15మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
మంత్రి అనుచరుల దురాగతమే
మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు వంద మందికిపైగా వచ్చి మా గ్రామస్తులపై దాడి చేశారు. సిద్దార్థగౌడ్ అనే వ్యక్తి తనవెంట వచ్చిన వారితో కలిసి ఈ దాడికి తెగబడ్డారు. ఇలాంటి దాడులను అరికట్టాల్సిన పోలీసులు చోద్యం చూశారే తప్ప నిలువరించలేదు. – విశ్వనాథ నాయుడు, ఎంపీటీసీ, మాధవరం


