రెండునెలలుగా 50 వేల మంది ఎదురుచూపులు
మార్చితో గడువు ముగియడంతో సర్వీసు కూడా ఇప్పటివరకు పొడిగించని ఆర్థిక శాఖ
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సర్వీసు కాలం ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగిసింది. సర్వీసు కాలాన్ని పొడిగించకుండా ఆర్థిక శాఖ తాత్సారం చేస్తుండడంతో వేతనాలు నిలిచిపోయాయి.
సర్వీసు కాలం పొడిగిస్తూ ఆర్థిక శాఖ జీఓ జారీ చేస్తేగానీ వీరికి వేతనాలు రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిధి పోర్టల్లో వీరి వివరాలు నమోదు కాలేదనే సాకుతో ఆర్థికశాఖ మార్చి నెల వేతనాలు కూడా చెల్లించలేదు. గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తూ ఆర్థికశాఖ జారీ చేసిన గడువు మార్చితో ముగిసింది. దీంతో ఏప్రిల్ వేతనాలనూ చెల్లించలేదు.
సాధారణంగా ఏటా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్థికశాఖ జీఓలు జారీ చేస్తుంది. గతంలో జారీచేసిన జీఓ గడువు మార్చి నెలాఖరుతో ముగిసినప్పటికీ మే వచ్చినా వారి సర్వీసు పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయలేదు. రెండు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు.


