డీజీజీఐ విశాఖ జోనల్ యూనిట్ కార్యాలయం
72 డమ్మీ సంస్థల ద్వారా రూ.1472 కోట్ల లావాదేవీలు
ఇద్దరు నిందితుల అరెస్ట్... పరారీలో కీలక సూత్రధారి
కుంభకోణాన్ని బట్టబయలు చేసిన డీజీజీఐ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు జరపకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఇన్పుట్ ట్యాక్స్ కొట్టేసిన వ్యవహారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విశాఖ జోనల్ యూనిట్ అధికారులు ఛేదించారు. ఆధునిక డేటా అనలిటిక్స్ సాయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న రూ.217 కోట్ల భారీ నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కుంభకోణం బట్టబయలైంది.
డీజీజీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... వ్యాపారం జరగకపోయినా పలు డమ్మీ కంపెనీల పేరుతో జరిగినట్లుగా రికార్డులు సృష్టించిన దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. ఈయన సిద్ధగోని ప్రభాకర్, రామావత్ నాగరాజు నాయక్తో కలిసి అమాయకుల నుంచి ఆధార్, పాన్కార్డులను సేకరించేవారు. ఇలా తీసుకున్న వాటితో ఏకంగా 72 షెల్ కంపెనీలు సృష్టిం చేశారు. ఖాళీగా ఉన్న చిన్న దుకాణాలను అద్దెకు తీసుకుని, నకిలీ అద్దె ఒప్పంద పత్రాలు, యుటిలిటీ డాక్యుమెంట్స్తో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందారు.
అనంతరం కేంద్రీకృత డిజిటల్ నియంత్రణ ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. ఎలాంటి వస్తువుల సరఫరా లేకుండానే రూ.1,472 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్ల ద్వారా అక్రమాలు చేశారు. రామావత్ నాగరాజు నాయక్ క్షేత్ర స్థాయిలో డమ్మీ యజమానులను సృష్టించి.. ఫోర్జరీ పత్రాలు, అద్దె ఒప్పందాలు తయారు చేసేవాడు. సిద్ధగోని ప్రభాకర్ జీఎస్టీ రిజి్రస్టేషన్లు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియల్ని పూర్తి చేసేవాడు. ఈ లాగిన్ వివరాలను సేకరించి.. ప్రధాన సూత్రధారి అంజిరెడ్డి.. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం దరఖాస్తు చేసేవాడు.
ఇలా ఇప్పటి వరకూ 72 దొంగ కంపెనీల ద్వారా ఏకంగా రూ.217 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని కొల్లగొట్టినట్లు డీజీజీఐ డేటా అనలటిక్స్ సాంకేతికతతో గుర్తించి నిందితులను వలపన్ని పట్టుకున్నారు. నాగరాజు నాయక్, ప్రభాకర్లను అరెస్ట్చేశారు. ప్రధాన నిందితుడు అంజిరెడ్డి మాత్రం పరారీలో ఉన్నాడు. నిందితులను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న అంజిరెడ్డి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతోపాటు ఈ కుంభకోణం ద్వారా లబి్ధపొందిన వారు ఎవరెవరున్నారు.? ఆరి్థక మూలాల్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని డీజీజీఐ విశాఖ యూనిట్ అధికారులు వెల్లడించారు.


