రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన | Rajyasabha: Ysrcp Mp Pilli Bose Raised Issues Of Ap Govt Employees | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన

Apr 2 2026 1:22 PM | Updated on Apr 2 2026 1:37 PM

Rajyasabha: Ysrcp Mp Pilli Bose Raised Issues Of Ap Govt Employees

సాక్షి, ఢిల్లీ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ప్రస్తావించింది. రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. 33 ఏళ్ల సర్వీస్‌కే కంపల్సరీ రిటైర్‌మెంట్‌ నిబంధనపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులలో అభద్రత ఏర్పడిందన్నారు. దీంతో ఉద్యోగులు 58 ఏళ్లకే రిటైర్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఫలితంగా ఉద్యోగులు నాలుగేళ్ల ముందుగానే సర్వీసు, ఆర్థిక ప్రయోజనాలు పెన్షన్ ప్రయోజనాలు కోల్పోతున్నారని సుభాష్‌ చంద్రబోస్‌ వివరించారు.

‘‘ఇప్పటికే పే రివిజన్ కమిషన్ బెనిఫిట్స్ పెండింగ్‌లో పెట్టారు. డీఏ బకాయిలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వేలకోట్ల రూపాయలు చెల్లించడం లేదు. పెన్షన్ సెటిల్‌మెంట్‌ కోసం రిటైర్డ్ ఉద్యోగులు రెండేళ్లపాటు వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. సచివాలయ ఉద్యోగులకు అలవికాని సర్వే టార్గెట్లు పెడుతున్నారు. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదు’’ అని సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.

‘‘గత వైఎస్సార్ ప్రభుత్వంలో రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 కు పెంచాం. పీఆర్‌సీని అమలు చేశాం. డీఏ పెంచి బకాయిలను క్లియర్ చేశాం. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా అన్ని రకాల సహకారం అందించాం. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సర్వీస్ కండిషన్స్ అమలయేలా  చర్యలు తీసుకోవాలి’’ అని సుభాష్‌ చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement