
మత్తెక్కించే మాటలు.. నగ్న వీడియోలు
యువకులను మోసగిస్తున్న ముఠా గుట్టురట్టు
కర్నూలు: సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన భార్య, భర్త, ఓ ప్రేమికురాలు ముఠాగా ఏర్పడి మత్తెక్కించే మాటలతో యువకులను ఆకట్టుకొని, ఆ తర్వాత బెదిరించి డబ్బు గుంజుతున్న వ్యవహారాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి బలరాం నగర్కు చెందిన చిక్కిరి మల్లేష్, భార్య పెరుమాళ్ల మేరీ, మల్లేష్ ప్రేమికురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ ముఠాగా ఏర్పడి డబ్బున్న వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తుంటారు. వారికి ఫోన్ చేసి తీయనైన మాటలతో ముగ్గులోకి దింపి నగ్న వీడియోలు పంపి బెదిరించి డబ్బులు దండుకునేవారు. కర్నూలుకు చెందిన వ్యాపారి ప్రదీప్ ఈ ముఠా సభ్యుల మాటలను నమ్మి దాదాపు రూ.3.80 కోట్ల నగదు వారి ఖాతాలకు బదిలీ చేసి మోసపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతికత సాయంతో వారు వినియోగించిన కాల్ డేటా ఆధారంగా రెండో పట్టణ పోలీసులు ముఠా సభ్యుల గుట్టు రట్టు చేసి కటకటాలకు పంపారు.
తక్కువ ధరకే పొలం ఇస్తామంటూ మోసం..
ముగ్గురు ముఠా సభ్యులు కలసి సంయుక్త రెడ్డి పేరుతో ట్విటర్ ఖాతా ద్వారా నగ్నంగా వీడియో కాల్స్ చేసి మత్తెక్కించే మాటలతో నమ్మించి మోసానికి పాల్పడ్డారు. విజయవాడకు సమీపంలో తమకు ఖరీదైన పొలం ఉందని, డబ్బులు అవసరమున్నందున తక్కువ ధరకే ఇస్తామంటూ రూ.3.80 కోట్లు వసూలు చేశారు. రూ.41.26 లక్షలకు రెండు కార్లు, ఓ మోటర్ సైకిల్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన డబ్బు రూ.3.38 కోట్ల నగదును ముగ్గురూ పంచుకుని జల్సా చేశారు.
ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ముఠా సభ్యులను అరెస్టు చేసి విచారించగా వారి నేరాల చిట్టా బయటపడింది. వారి నుంచి 2 కార్లు, మోటర్ సైకిల్, ల్యాప్టాప్, 3 సెల్ఫోన్లు, 5 తులాల బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించినట్లు పేర్కొన్నారు.