మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో 5 వైద్య కళాశాలలు ప్రారంభం
వాటిలో 750 ఎంబీబీఎస్, 96 పీజీ సీట్లు అందుబాటులోకి
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) 36 పీజీ సీట్లను కొత్తగా మంజూరు చేసింది. ఈ విద్యా సంవత్సరంలో తొలి విడతలో 60 సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేసింది. రెండో విడతలో ఏలూరు వైద్య కళాశాలకు 12, రాజమహేంద్రవరం – 4, మచిలీపట్నం – 8, నంద్యాల – 4, విజయనగరం కళాశాలకు 8 చొప్పున పీజీ సీట్లను ఎన్ఎంసీ కేటాయించినట్లు డీఎంఈ డాక్టర్ రఘనందన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రంలో 5 కొత్త కళాశాలలు అందుబాటులోకి తీసుకురావడంతో ప్రస్తుతం 96 పీజీ సీట్లు రాష్ట్రానికి సమకూరినట్లయింది. రాష్ట్రంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల ల ఏర్పాటులో భాగంగా 2023 – 24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలను గత ప్రభుత్వంలో ప్రారంభించారు. తద్వారా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.


