
లాక్డౌన్తో నిర్మానుషంగా మారిన ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్ (ఫైల్)
సాక్షి, ఒంగోలు: నగరంలో కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ద్వారా వైరస్ వ్యాప్తికి చెక్ చెక్ పెట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటి వరకు కొన్ని రకాల సడలింపులతో పరిమిత ఆంక్షలు విధిస్తూ వచ్చిన అధికారులు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో కంటైన్మెంట్ ఆంక్షలు అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో నగరపాలక సంస్థ పరిధిలో పటిష్టమైన లాక్డౌన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ పోల భాస్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం నుంచి రెండు వారాల పాటు కఠినమైన ఆంక్షలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిత్యావసర సరుకులకు మాత్రమే అనుమతించారు. (‘పర్ఫెక్ట్’వల్లే శానిటైజర్ మరణాలు)
మెడికల్ షాపులు తెరుచుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. మిగిలిన ఎటువంటి వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తొమ్మిది గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలిచ్చారు. అత్యవసర సేవలకు, విధులకు హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగులు విధిగా గుర్తింపు కార్డులను విధిగా వెంట ఉంచుకోవాలి. ఈ నింబంధనలు రెండు వారాలపాటు పక్కాగా అమలు కానున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలో అమలు చేస్తున్న లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కమిషనర్ పిడతల నిరంజన్రెడ్డి, ఒంగోలు తహసీల్దార్ కె.చిరంజీవి కోరారు.