రిటర్నబుల్‌ ప్లాట్లలో అక్రమ తవ్వకాలు | Illegal miniing in Returnable Plots: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రిటర్నబుల్‌ ప్లాట్లలో అక్రమ తవ్వకాలు

May 4 2026 5:27 AM | Updated on May 4 2026 5:27 AM

Illegal miniing in Returnable Plots: Andhra pradesh

ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్న నవులూరు రైతులు 

ప్రభుత్వ పెద్దల అండతోనే మట్టి మాఫియా అరాచకం

మంగళగిరి టౌన్‌ : అమరావతి రాజధాని ప్రాంతంలోని రిటర్నబుల్‌ ప్లాట్లతో సహా వివిధ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతో మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. అధికారిక అనుమతులు లేకుండానే జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో మట్టిని భారీగా తరలిస్తూ అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు. మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన వారికి కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లలో అక్రమంగా మట్టి తవ్వుతున్నారని తెలుసుకున్న రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

తవ్వకాలు సాగిస్తున్న పొక్లెయిన్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తమకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లలో భారీ యంత్రాలతో మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మట్టి తవి్వతే మా గతేమిటంటూ రైతులు ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోక పోవడంపై రైతులు మండిపడ్డారు.

తవ్వకాల వల్ల తమ ప్లాట్లలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వర్షం వస్తే చెరువుల్లా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి గుంతల భూములను ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. తక్షణమే తమకు కేటాయించిన ప్లాట్లలో అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, గుంతలను పూడ్చి వేయాలని డిమాండ్‌ చేశారు. మట్టి మాఫియా ఇంత భారీగా తవ్వకాలు సాగిస్తోందంటే తప్పకుండా ప్రభుత్వ పెద్దల అండ ఉంటుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement