భారీ ఆధునీకరణ, విస్తరణ ప్రణాళికలు 2047 నాటికి గ్లోబల్ ప్లేయర్గా మారడమే ధ్యేయం
అత్యున్నత లక్ష్యాలతో అడుగులు
ఎండీ కెప్టెన్ దివాకర్ వెల్లడి
మార్చి 29న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేక ఇంటర్వ్యూ
సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటూ.. ప్రపంచంలోనే అతిపెద్ద డ్రెడ్జింగ్ సంస్థల్లో ఒకటిగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) అవతరించే సమయం అతి సమీపంలోనే ఉందని సంస్థ ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్. దివాకర్ స్పష్టం చేశారు. కొత్త డ్రెడ్జర్లతో 2035 నాటికి డ్రెడ్జింగ్ రంగంలో గేమ్చేంజర్గా సంస్థ ఎదగనుందని ఆయన తెలిపారు. తద్వారా 2047కి గ్లోబల్ ప్లేయర్గా మారడమే సంస్థ లక్ష్యమన్నారు.
ఉద్యోగులంతా కలిసికట్టుగా డీసీఐని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటూ మార్చి 29న సంస్థ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కెప్టెన్ దివాకర్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..
ఆధునికీకరణ
గతంలో పోర్టుల్లో డెప్త్ (డ్రాఫ్ట్) 10 నుంచి 12 మీటర్లు మాత్రమే ఉండేది. క్రమంగా పోర్టులు ఆధునికీకరణ.. లాజిస్టిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన తర్వాత ఈ డెప్త్ 20–22 మీటర్ల వరకూ పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రెడ్జర్లు అంత డెప్త్ సామర్థ్యానికి పనిచెయ్యలేవు. అందుకే.. వాటన్నింటినీ ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం డ్రెడ్జర్ల సక్షన్ ట్యూబ్ పొడవు 25 మీటర్ల వరకే డ్రెడ్జింగ్ చేస్తున్నాం. ఇకపై 30 మీటర్లు వెళ్లేలా ఆధునికీకరిస్తున్నాం. ఇక డీసీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న 10 వెసెల్స్ ఆధునీకరణ జరిగింది. దీంతో 90 శాతం వరకూ పనితీరు పెరగనుంది.
11 కొత్త డ్రెడ్జర్ల నిర్మాణం
డీసీఐని ఆధునికీకరణకు రూ.4 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రధాని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త పోర్టుల్లో కార్యకలాపాల దగ్గర నుంచి రిజర్వాయర్లు, ఇన్లాండ్ వాటర్వేస్ నిర్వహణ బాధ్యతల్లో డీసీఐ తనదైన ముద్ర వేసేందుకు అత్యాధునిక సాంకేతికతతో కొత్తగా 11 పర్యావరణ అనుకూల డ్రెడ్జర్లను నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.
ఇందుకు కన్సారి్టయం పోర్టుల సహకారం కోరుతోంది. 30 శాతం నిధులు సమకూర్చాలని కోరాం. మిగిలిన మొత్తం మేము భరించాలని భావిస్తున్నాం. ప్రస్తుతం అతితక్కువ సల్ఫర్ ఇంధనాలు వాడుతున్నాం. భవిష్యత్తులో అమ్మోనియా, మిథనాల్, ఎల్ఎన్జీ వంటివి వినియోగిస్తూ గ్రీన్ డ్రెడ్జర్లు దిశగా అడుగులు వేస్తాం.
గోదావరి తరహాలో మరో రెండు డ్రెడ్జర్లు.!
ప్రపంచంలోనే మొట్టమొదటి 12,000 క్యూబిక్ మీటర్ల బీగల్ సిరీస్ డ్రెడ్జర్.. ‘డీసీఐ డ్రెడ్జ్ గోదావరి’ రానున్న కొద్ది నెలల్లో జేఎన్పీటీ, పారాదీప్ పోర్టుల్లో కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనివల్ల డీసీఐ సామర్థ్యం భారీగా పెరగనుంది. సామర్థ్యం, పర్యావరణ స్థిరత్వంలో ఇది ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయనుంది. దీనికి తోడుగా 12 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో ఈ ఏడాది ఒకటి, 2028లో మరో డ్రెడ్జర్ని ఆర్డర్ చేయనున్నాం. భారత్లో 120 మిలియన్ క్యూబిక్ మీటర్లు (ఎంక్యూఎం) డ్రెడ్జ్ చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం డీసీఐ 60 ఎంక్యూఎం చేస్తోంది. బయట సంస్థల సహకారం తీసుకొని మరో 20 ఎంక్యూఎం చేస్తున్నాం.
రూ.17,645 కోట్ల ఎంవోయూలు
ఇండియన్ మారీటైమ్ సదస్సులో రూ.17,645 కోట్ల విలువైన ఎంవోయూలు అమల్లోకి తీసుకొస్తున్నాం. కోవిడ్తో పాటు 2023 నుంచి ప్రపంచ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం డీసీఐపైనా ఉంది. అయితే నష్టాలు రాకుండా.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (పీఎంసీ) కింద ఒప్పందాలు చేసుకుంటున్నాం. ఫలితంగా నష్టాల నుంచి లాభాల్లోకి పయనించే దిశగా వెళ్తున్నాం. మానవ వనరుల అభివృద్ధిపైనా దృష్టిసారించాం. ఇక దేశంలోని సుమారు 1000 డ్యామ్లు, రిజర్వాయర్లలో ఏళ్లతరబడి పూడికతీత సమగ్రంగా జరగడం లేదు. దీనివల్ల నీటి నిల్వల సామర్థ్యం తగ్గుతోంది. సమస్య పరిష్కారానికి కేబుల్ డ్రెడ్జర్లు నిర్మించనున్నాం.
బహుముఖ విస్తరణ
కొచ్చి, ట్యుటుకోరియన్ మొదలైన కొత్త పోర్టుల్లో ఆధునికీకరణ పనులు చేసేందుకు క్యాపిటల్ డ్రెడ్జింగ్కు అవసరమైన ఎక్విప్మెంట్ లేదు. ఇందుకోసం కట్టర్ సక్షన్ డ్రెడ్జర్ (సీఎస్డీ) నిరి్మంచనున్నాం. పుదుచ్చేరి, పారాదీప్, కాండ్లా, కోల్కతా ప్రాంతాల్లో షాలోవాటర్ డ్రెడ్జింగ్ చేసేందుకు 3000 హోపర్ కెపాసిటీతో షాలో వాటర్ డ్రెడ్జర్ నిర్మించనున్నాం. అదేవిధంగా.. భారత్లో లాజిస్టిక్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఇన్ల్యాండ్ వాటర్వేస్ని కేంద్రం అభివృద్ధి చేస్తోంది. అందుకే ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల నదుల్లో డ్రెడ్జింగ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీనికోసం 6 వరకూ చిన్న డ్రెడ్జర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించాం.


