నీతి ఆయోగ్‌ వేదికపై రాష్ట్ర ప్రగతి చిత్రం

CM YS Jagan To Attend NITI Aayog Governing Council meeting - Sakshi

27న న్యూఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం.. హాజరుకానున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఆ సమావేశంలో చర్చించనున్న అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష

నాలుగేళ్లలో వివిధ రంగాల్లో రాష్ట్రం గణనీయమైన పురోగతి

ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో చరిత్రాత్మక మార్పులు

ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడుతో సత్ఫలితాలు

తల్లులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం 

మహిళా సాధికారిత కోసం విప్లవాత్మక కార్యక్రమాలు

పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి  

మరింత ప్రగతి సాధించేందుకు ఊతమందించాలి   

సాక్షి, అమరావతి: గత నాలుగేళ్లలో వివిధ అంశాలు, పలు రంగాల్లో సాధించిన ప్రగతిని నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో వివరించడంతోపాటు కేంద్రం నుంచి సహాయాన్ని కోరా­లని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కీలక రంగా­లకు సంబంధించి కొన్ని సూచనలు కూడా 
చేయ­నుంది. ఈనెల 27న న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్య­క్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు­కాను­న్నారు. ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో చర్చించనున్న అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులు.. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను స్పష్టంగా వివరించేలా సన్నద్ధం కావాలన్నారు. 104 వాహనాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను వివరించడంతో పాటు పీహెచ్‌సీలు, విలేజ్‌ క్లినిక్‌ల మధ్య అనుసంధానం ద్వారా కార్యక్రమం ఎలా విజయవంతంగా సాగుతుందో తెలియజేయాలని నిర్ణయించారు. సమీక్షలో చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి. 

మహిళా సాధికారిత దిశగా అడుగులు
► మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టింది. దీంతోపాటు బహుళజాతి కంపెనీలతో కలిసి చేయూత పథకాన్ని అమలు చేస్తోంది. తద్వారా ఆయా కుటుంబాల్లో జీవన ప్రమాణాలు పెరిగేందుకు, ఆర్థికంగా వారు నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించింది. 

► మహిళా సాధికారిత దిశగా చేయూతతో పాటు, ఆసరా, సున్నా వడ్డీ రుణాలు కీలక పాత్ర పోషించాయి. ‘దిశ’ కింద చేపట్టిన కార్యక్రమాలు.. సత్వరమే స్పందించిన తీరు వల్ల వేలాది మంది బాలికలు, మహిళలకు రక్షణ లభించింది.

► మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ.. ఈ మూడు విభాగాలు కలిసి డేటాను సమ్మిళితం చేయాలి. తల్లి గర్భం దాల్చి, కాన్పు పూర్తి కాగానే శిశువుకు ఆధార్‌ నంబరు కేటాయింపు జరిగేలా చూడాలి. 

► ఆ తర్వాత పిల్లలకు పౌష్టికాహారం అందించడం దగ్గర నుంచి, అంగన్వాడీల్లో చేరిక, తర్వాత స్కూల్లో చేరిక వరకూ వారిని ట్రాక్‌ చేయడానికి సులభతరం అవుతుంది. పిల్లల ఆరోగ్యం, వ్యాక్సినేషన్, చదువులు తదితర అంశాలన్నింటినీ ట్రాక్‌ చేయొచ్చు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్‌లో కీలక ప్రగతి
► రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్‌ రంగంలో త్వరితగతిన ఘనణీయమైన ప్రగతి సాధ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఎంఎస్‌ఎంఈలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మద్దతు కావాలి. 

► రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లతో తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు బాగా పెరగనున్నాయి. 

► కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులకు నిధులు పూర్తి స్థాయిలో వెచ్చించి వాటిని సంపూర్ణ వినియోగంలోకి తీసుకొచ్చాం. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. నెల్లూరు సమీపంలోని తెట్టువద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకు సాగేలా అడుగులు వేస్తున్నాం. 

పరిశ్రమల నుంచి నిరంతరం ఫీడ్‌ బ్యాక్‌ 
► పరిశ్రమల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలి.  

► ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో హైపర్‌ టెన్షన్, డయాబెటిస్‌.. రెండూ ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీరికి వైద్యం అందించడం, ఫాలోఅప్‌ చేయడం చాలా ముఖ్యం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న బోధనాస్పత్రులు, కొత్తగా నిర్మించనున్న బోధనాస్పత్రుల్లో తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించిన ల్యాబ్‌లు, కాథ్‌ ల్యాబ్స్‌ తప్పనిసరిగా పెట్టాలి. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలి.

స్కిల్‌ కార్యక్రమాల్లో వేగం పెరగాలి
► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగంలో కార్యక్రమాల వేగం పెంచాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి. ఇదివరకే డిగ్రీలు సాధించిన వారు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఈ స్కిల్‌ సెంటర్లు ఉపయోగపడతాయి. 

► నియోజకవర్గాలలో హబ్స్, జిల్లాల వారీగా సెంటర్లలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల రూపకల్పనకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. కాలానుగుణంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునేందుకు ఈ కోర్సులను సంబంధిత యూనివర్సిటీ ద్వారా రూపొందించాలి.  

► స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయి. రూ.371 కోట్లు దోచుకున్నారు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలి. ప్రభుత్వ రంగంలో స్కిల్‌ కాలేజీలు, వీటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో.. మంచి వ్యవస్థలు ఏర్పడతాయి. తద్వారా నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top