మిట్టల్ స్టీల్ కోసం 13 రాష్ట్రాలతో పోరాడి సాధించుకున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అన్యాయం
చంద్రబాబు సర్కారు అడ్డగోలు విధానాలతో ప్రశ్నార్థకంగా మారిన పార్కు భవితవ్యం
బల్క్ డ్రగ్ పార్కు కోసం నక్కపల్లి వద్ద గత ప్రభుత్వం 2,000 ఎకరాల భూసేకరణ
అందులో 783.74 ఎకరాలు ఇప్పుడు మిట్టల్ స్టీల్కు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం
బల్క్ డ్రగ్ పార్కు కోసం కొత్తగా మత్స్యకార గ్రామాల్లో భూసేకరణకు యత్నం
భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు, స్థానికులు
కేంద్ర నిబంధనల ప్రకారం ఇప్పటికే పూర్తి కావాల్సిన పార్కు
సాక్షి, అమరావతి: ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 13 రాష్ట్రాలతో పోరాడి దక్కించుకున్న బల్క్ డ్రగ్ పార్కుపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది. ఈ పార్కు కోసం గత ప్రభుత్వం సేకరించిన 2,000 ఎకరాల్లో 783.74 ఎకరాలు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్కు కేటాయించడం ద్వారా ప్రాజెక్టును వివాదాల సుడిగుండంలోకి నెట్టేశారు.
ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్ఎస్ ఇండియా) సంస్థ 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 23న భూమిపూజ చేయనున్నారు. ఈ ఉక్కు కర్మాగారం కోసం ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన బల్క్ డ్రగ్ పార్కును బాబు సర్కారు నిర్వీర్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ప్రభుత్వం వివాద రహితంగా భూసేకరణ పూర్తిచేసినా..!
ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి కేటాయించిన భూమికి బదులుగా బల్్కడ్రగ్ పార్కుకు 790 ఎకరాలు భూమిని మత్స్యకార గ్రామాల్లో బాబు సర్కారు కేటాయించినా.. అక్కడ మత్స్యకారులు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో బల్క్ డ్రగ్ పార్కు ప్రశ్నార్థకంగా మారింది. తొలుత నక్కపల్లి వద్ద బల్్కడ్రగ్ పార్కును అనకాపల్లి, నక్కపల్లి మండలాలకు చెందిన రాజయపేట, డీఎల్ పురం, వేంపాడు, బుచ్చిరాజు పేట, చందనాడ గ్రామాల్లో ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు.
ఆ తర్వాత ఈ భూమిని రాజయపేట, డీఎల్పురం, వేంపాడు, బుచిరాజుపేట, చందనాడ, పెద్దతీర్నాలా సీహెచ్ లక్ష్మీపురం, ఉపమాక, ఎన్నర్సాపురం, గుడివాడ గ్రామాల పరిధిలోకి మార్చారు. గత ప్రభుత్వం వివాద రహితంగా భూ సేకరణ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియనూ పూర్తి చేసింది. ఈ లోగా ఎన్నికలు రావడంతో నిర్మాణ పనుల ప్రారంభం ఆగింది. ఈ ఏడాది మార్చి నాటికి బల్్కడ్రగ్ పార్కును అందుబాటులోకి తీసుకురావాలని గత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.
2024లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో దీనిపై నీలినీడలు కమ్ముకున్నాయి ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఒక తట్టెడు మట్టి ఎత్తకపోగా చంద్రబాబు సర్కారు మొత్తం ప్రాజెక్టును వివాదాల్లోకి నెట్టేసింది. కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందాలంటే ఈ ప్రాజెక్టును ఈ నెలలోగా పూర్తి చేయాల్సి ఉంది. కానీ భూసేకరణ కూడా పూర్తి కాకపోవడంతో ఈ గడువును మరో ఏడాది అంటే వచ్చేఏడాది మార్చి వరకు పెంచాలంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది.
మిట్టల్ కోసం విశాఖ ఉక్కు ప్రయోజనాలూ తాకట్టు
మిట్టల్ స్టీల్పై ఉన్న విపరీతమైన ప్రేమతో విశాఖ స్టీల్ప్లాంట్పై ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వేషం పెంచుకున్నారు. విశాఖ ఉక్కుపై తన అక్కసును పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపరిచారు. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు ముగింపు సమావేశంలో విశాఖ స్టీల్పై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఒంటికాలిపై లేచారు. విశాఖ స్టీల్ కారి్మకులను పనిదొంగలని అభివరి్ణంచారు. పనిచేయకుండా కూర్చొబెట్టి జీతాలు ఇవ్వాలా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అంతేకాదు విశాఖ ఉక్కుకు సొంత ఇనుప గనుల గురించి ఏనాడూ కేంద్రంతో చర్చలు జరిపి ఒప్పించని చంద్రబాబు ప్రైవేటు సంస్థ అయిన మిట్టల్ స్టీల్ కోసం నేరుగా ప్రధానిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా చెప్పారు. మిట్టల్ స్టీల్కు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) ముడి ఇనుమును లారీల ద్వారా సరఫరా చేస్తానంటే మిట్టల్ స్టీల్ గొట్టాలు (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని కోరిందని, దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో తాను స్వయంగా మాట్లాడినా పనికాకపోతే స్వయంగా ప్రధాని మోదీని కలిసి ఒకటికి రెండుసార్లు గట్టిగా చెప్పి పనిచేయించుకున్నట్లు తెలిపారు.
చరిత్రలో ఎక్కడా జరగనంత స్పీడ్గా అనుమతులన్నీ మంజూరు చేయించి రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచి్చనట్లు సీఎం తెలిపారు. అంతేకాకుండా ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే లాభాల్లోకి వస్తుందంటూ కితాబిచ్చారు. అంతేకాదు మిట్టల్ స్టీల్ కోసం కాకినాడ గేట్వే పోర్టు అభివృద్ధినీ పణంగా పెట్టి అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద సముద్రపు ఒడ్డు నుంచి 2.9 కిలోమీటర్లలోపు క్యాపిటివ్ గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి బాబు సర్కారు అనుమతించింది.
ఒక్క మిట్టల్ స్టీల్ కోసం బల్్కడ్రగ్ పార్కు, కాకినాడ గేట్వే పోర్టులను పణంగా పెట్టడమే కాకుండా అనుమతుల దగ్గర నుంచి గనుల కేటాయింపు వరకు ప్రత్యేక దృష్టి సారించిన దాంట్లో పదో శాతం శ్రద్ద విశాఖ స్టీల్పై పెట్టి ఉంటే విశాఖ స్టీల్ ఇప్పటికే స్వయం ప్రతిపత్తి సంస్థగా ఎదిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు.


