అనకాపల్లి జిల్లాలో ఆటో కార్మీకుల వినూత్న నిరసన
సాక్షి, అనకాపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఆటో కార్మీకులు ధ్వజమెత్తారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా మునగపాకలో ఆటో కార్మీకులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపారు.
మెయిన్ రోడ్డు నుంచి రిక్షా స్టాండ్ వరకు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై పడి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలియం ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.


