AP-Genco Record In Power Generation, Details Inside - Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వెలుగులు.. ఉత్పత్తిలో ఏపీ జెన్‌కో రికార్డు

Jun 21 2023 3:04 PM | Updated on Jun 21 2023 5:10 PM

Ap Genco Record In Power Generation - Sakshi

గత ఏడాది మేనెలలో రాష్ట్ర గ్రిడ్‌ విద్యుత్‌ డిమాండు 5947.39 మిలియన్‌ యూనిట్లు కాగా ఏపీ జెన్‌కో 1989.37 మిలియన్‌ యూనిట్లు సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండు 6430.72 మిలియన్‌ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్‌కో 2917.99 మిలియన్‌ యూనిట్లను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అందించిది.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్‌కో) విద్యుత్‌ ఉత్పత్తిలో రికార్డులు నమోదు చేస్తోంది. మే నెలలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏపీ జెన్‌కో 12 శాతం అధికంగా విద్యుత్‌ సరఫరా చేసింది. రాష్ట్ర విద్యుత్‌ డిమాండులో ఏపీ జెన్‌కో గత ఏడాది మే నెల 33.45 శాతం సమకూర్చగా ఈ ఏడాది అదే నెలలో అంచనాలకు మించి 45.38 శాతం గ్రిడ్‌కు అందించడం గమనార్హం.  గత ఏడాది మేనెలలో రాష్ట్ర గ్రిడ్‌ విద్యుత్‌ డిమాండు 5947.39 మిలియన్‌ యూనిట్లు కాగా ఏపీ జెన్‌కో 1989.37 మిలియన్‌ యూనిట్లు సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండు 6430.72 మిలియన్‌ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్‌కో 2917.99 మిలియన్‌ యూనిట్లను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అందించిది.

ఏపీ జెన్‌కో రాష్ట్ర అవసరాల కోసం రాష్ట్ర గ్రిడ్‌కు గత సంవత్సరం మేనెలలో సరఫరా చేసిన విద్యుత్‌ కంటే ఈ సంవత్సరం మేనెలలో 989.37 మిలియన్‌ యూనిట్లు అధికంగా సరఫరా చేయడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా విద్యుత్‌ వినియోగం పెరిగిన సమయంలో సైతం ఏపీ జెన్‌కో సగటున 45 శాతం పైగా సమకూర్చుతుండటం విశేషం.

జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి పెంచడంవల్ల ఆ మేరకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రయివేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన భారం తగ్గినట్లే. ఈ మేరకు విద్యుత్‌ వినియోగదారులపై సర్దుబాటు ఛార్జీల పెంపు భారం తప్పింది. ఇది వినియోగదారులకు ఉపశమనం కలిగించే అంశం. గత వేసవి సీజన్లలో లాగే ఈ ఏడాది మేలో కూడా  డిమాండు సాధారణంగా ఉండి ఉంటే ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా వాటా 50 శాతం దాటి ఉండేదని గణాంకాలను బట్టి తేటతెల్లమవుతోంది. 

‘సాగర్‌’ రికార్డు
నాగార్జున సాగర్‌ కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నలబై ఏళ్లలో ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్‌ యూనిట్ల అత్యధిక విద్యుత్‌  ఉత్పత్తి చేసింది. ప్రాజెక్టు నలబై ఏళ్ల చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ప్లాంట్లలో ఉద్యోగులు అంకిత భావంతో కృషి చేయడం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చక్కటి మార్గదర్శకంతో ప్రోత్సహించడంవల్లే ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి పెరిగిందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) పెరగడానికి పాటుపడినందుకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్‌కో ఛైర్మన్‌ కె. విజయానంద్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు ఉద్యోగులను అభినందించారు.

డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌) లో ఇటీవల ౖప్రయోగాత్మకంగా  ఉత్పత్తి ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేసిన  800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి వచ్చే నెల శ్రీకారం చుడతామని ఎండీ  ఉద్యోగులకు తెలిపారు. దీంతో ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల సామర్థం 5810 మెగావాట్ల నుంచి 6610 మెగావాట్లకు పెరుగుతుంది. ఏపీ జెన్‌కో (థర్మల్, హైడల్, సోలార్‌ కలిపి) మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 8789.026 మెగావాట్లకు పెరగనుంది. 

ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు ప్రణాళిక : ఎండీ చక్రధర్‌ బాబు
విద్యుత్‌ రంగంలో అపార అనుభవం ఉన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ మార్గదర్శకత్వంలో ఇంధన, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంపూర్ణ సహాయ, సహకారాలతో ఏపీ జెన్‌కో విద్యుదుత్పత్తి సామర్థ్యం మరింతగా పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్‌ డిమాండు పెరుగుతోంది.

ఏ రంగం ప్రగతికైనా విద్యుత్‌ కీలకం. ప్రతి యేటా విద్యుత్‌ డిమాండు 8 శాతం పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్‌ డిమాండులో అత్యధిక భాగం సాధ్యమైనంత మేరకు పూర్తి స్థాయిలో ఏపీ జెన్‌కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకం చేశారు. 
చదవండి: ప్రగతి పథంలో ఆర్టీసీ 

వారి మార్గదర్శకం మేరకు 5000 మెగావాట్ల సామర్థ్యంగల పంప్డ్‌ స్టోరేజి ప్లాంట్ల (పీఎస్పీ) ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. పీక్‌ డిమాండు సమయంలో ఉత్పత్తి పెంచడానికి, సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి హఠాత్తుగా పడిపోయినప్పుడు గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు పీఎస్పీలు చాలా ఉపయోగపడతాయి. పీక్‌ డిమాండు సమయంలో అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన భారం కూడా వీటివల్ల తప్పుతుంది.

ఈ ఆలోచనతోనే అప్పర్‌ సీలేరులో 1350 మెగావాట్ల పీఎస్పీ నిర్మించాలని ఇప్పటికే  కేంద్ర విద్యుత్‌ మండలి (సీఈఏ) నుంచి అనుమతి తీసుకున్నాం. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ. 11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. 

Advertisement
 
Advertisement
Advertisement