నాన్న నేను భాగానే ఉన్నాను... | Andhra Pradesh steps up efforts for safe return of students from Ukraine | Sakshi
Sakshi News home page

నాన్న నేను భాగానే ఉన్నాను...

Mar 3 2022 10:03 AM | Updated on Mar 3 2022 10:03 AM

Andhra Pradesh steps up efforts for safe return of students from Ukraine - Sakshi

జోత్స్న భార్గవి

తెనాలి రూరల్‌/రేపల్లె: రణరంగంగా మారిన ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారోనన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు కొంత ఊరట కలిగించే సమాచారం అందింది. తెనాలి విద్యార్థులు ఆ దేశ సరిహద్దు దాటేశారు. యుద్ధభూమిని దాటి మరో దేశంలోకి విద్యార్థులు ప్రవేశించినట్టు సమాచారం. ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో చదువుతున్న తెనాలి మండలం కొలకలూరుకు చెందిన షేక్‌  రేష్మ బుధవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఉన్న ఆమె గురువారం విమానంలో గన్నవరం చేరుకుంటుంది. ఇక ఉక్రెయిన్‌లోని జపొరిజ్జియాలో చదుతున్న తెనాలికి చెందిన చెన్నుపాటి రాణి, రావి శేషసాయి లక్ష్మీగణేష్, విష్ణుమొలకల వైష్ణవి, సమ్మెట టెండుల్కర్‌ వర్మ ఉక్రెయిన్‌–హంగేరి సరిహద్దుకు భారత కాలమానం ప్రకారం మంగళవరాం అర్ధరాత్రి దాటాక చేరుకున్నా రు. 


                                      షేక్‌  రేష్మ

అక్కడ నుంచి పాస్‌పోర్టులు, ఇతర తనిఖీలు పూర్తి చేసుకుని హంగేరి దేశంలోకి ప్రవేశించారు. హంగేరి సరిహద్దు నుంచి 18 గంటలు ప్రయాణించి ఆ దేశ రాజధాని బుడాపెస్ట్‌కు వెళ్లేందుకు రైలులో ఉన్నారు. వీరు బుధవారం అర్ధరాత్రి దాటాక బుడాపెస్ట్‌ చేరుకునే అవకాశం ఉంది. చెంచుపేటకు చెందని బొందలపాటి లక్ష్మీశ్రీలేఖ ఇప్పటికే బుడాపెస్ట్‌ చేరు కుంది. గురువారం ఉదయం ఢిల్లీ చేరుకుంటానని కుటుంబసభ్యులకు సమాచారమందించింది. ఇక రొమేనియా రాజధాని బుకారెస్ట్‌లోని శిబిరంలో ఇప్పటికే ఉన్న పట్టణానికి చెందిన గోపాలం రాజేష్, కొల్లిపర మండలం దంతులూరుకు చెందిన దర్శి డెయిసీ హవీలా ‘ఆపరేషన్‌ గంగా’లో భాగంగా తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. 

ఉక్రెయిన్‌ బోర్డర్‌కు చేరుకున్నాం వైద్య విద్యార్థినీ తల్లిదండ్రులకు ఫోన్‌ 
 ‘‘నాన్న నేను భాగానే ఉన్నాను... మీరు కంగారు పడకండి. అమ్మకు ధైర్యం చెప్పండి. ఉక్రెయిన్‌ బోర్డర్‌కు చేరుకున్నాం. నాతోపాటు చాలా మంది ఉన్నారు. ఇండియాకి రావటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ’’ ఉక్రెయిన్‌లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థినీ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తన యోగక్షేమాలపై వివరించింది. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన మందపాకల శ్రీనివాసరావు–శ్రీలక్ష్మిల కుమార్తె జోత్స్న భార్గవి జోప్రసి యూనివర్సిటీలో ఐదో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్నది. బుధవారం ఉదయం 11 గంటలకు తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లా డింది. తనతోపాటు ఇండియాకి చెందిన వి ద్యార్థులు 1500 మంది వరకు ఉంటారన్నారు. మేము క్షేమంగానే ఉన్నాం. ఇబ్బందేమీ లేదంటూ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది.   

Advertisement
 
Advertisement
Advertisement