వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దివ్యాంగుల సమస్యలను వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్
మాజీ సీఎం వైఎస్ జగన్కు వివరించిన ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు
వికలాంగుల హక్కుల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆవేదన
పీహెచ్డీ చేసినా రిజర్వేషన్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని వెల్లడి
దివ్యాంగులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిశారు. మంగవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దివ్యాంగ్ వింగ్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలలో 1,523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని వైఎస్ జగన్కు తెలిపారు.
ఉన్నత విద్యనభ్యసించి పీహెచ్డీలు పూర్తి చేసిన తమలాంటి దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కులు, సాధికారత కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వికలాంగుల హక్కుల చట్టం–2016ను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తీరువల్ల దివ్యాంగులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తమకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. దివ్యాంగుల సమస్యలను వైఎస్ జగన్ సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గుర్తుచేసి భవిష్యత్తులోనూ దివ్యాంగులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.


