● ఎర్రమట్టి కోసం అరాచకం
● అనుమతులు లేకుండా తవ్వకాలు
● రూ.కోట్లు పోగేసుకున్న టీడీపీ నేతలు
● పట్టించుకోని గనులశాఖ అధికారులు
అనంతపురం టౌన్: చంద్రబాబు పాలనలో అధికార పార్టీ నాయకులు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అందుబాటులో ఉన్న సహజ వనరులను కొల్లగొట్టేస్తున్నారు. అక్రమ తవ్వకాలు, విక్రయాల ద్వారా రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. జిల్లాలో ఎర్రమట్టి దందాకు రాప్తాడు నియోకవర్గం అడ్డాగా మారిపోయింది. అనంతపురం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో గనులశాఖ నుంచి గ్రావెల్ లీజులు తీసుకోకుండానే యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వేస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల అండదండలు మెండుగా ఉండడంతో కొండ గుట్టలను సైతం వదలకుండా గుండు కొట్టేశారు. ఇంత పెద్ద ఎత్తున మట్టిదందా సాగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
అనుమతులతో మాకేంటి పని?
తెలుగుదేశం పార్టీ నాయకుల ముఖ్య నాయకుల అండతో మట్టిదందా యథేచ్ఛగా సాగుతోంది. నాలుగు రోజుల క్రితం వడియంపేట దగ్గర జేసీబీలతో మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తుండడంతో స్థానికులు రెవెన్యూ, పోలీసుల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే బుక్కరాయసముద్రం పోలీసులు అలా వచ్చి వెళ్లిపోయారు. పెద్ద ఎత్తున ఎర్రమట్టి దందా సాగిస్తున్నారని తెలిసినా స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. ఇదొక్క ప్రాంతంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతోంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు సాగిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఇప్పటికై నా గనులశాఖ అధికారులు స్పందించి ఎర్రమట్టి దందాను అరికట్టాల్సిన అవసరం ఉంది.
క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం
గ్రావెల్ లీజులు తీసుకోకుండా అక్రమంగా తవ్వకాలు చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. ఎర్రమట్టి తవ్వకాలపై రాత్రివేళల్లో సైతం అధికారులతో తనిఖీలు చేయిస్తున్నాం. ఖనిజ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గనులశాఖ విజిలెన్సు అధికారులు సైతం జిల్లాలో తనిఖీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– ఆదినారాయణ, గనులశాఖ,
డిప్యూటీ డైరెక్టర్


