కళ్యాణదుర్గం: కంబదూరు మండలం తిమ్మాపురంలోని భంభం బాబా స్వామి మందిరంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులు, చేనేత కార్మికులతో కలెక్టర్ ఆనంద్ మంగళవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులు, జీవన విధానంపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం మంజూరు చేస్తే తాము ఆదాయం పెంచుకోగలమని చేనేత కార్మికులు కలెక్టర్కు చెప్పారు. అనంతరం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ అధికారి వర ప్రసాద్, చేనేత ఔళి శాఖ అభివృధ్ది అధికారి బసవరాజు, తహసీల్దార్ బాలకిషన్, ఎంఈఓ ఉమాపతి, హెచ్ఎం భారతి, తిమ్మప్ప, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
రీసర్వే పక్కాగా నిర్వహించాలి
కళ్యాణదుర్గం రూరల్: రీసర్వే పనులు పక్కాగా నిర్వహించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నాల్గవ దశ రీసర్వేలో భాగంగా మంగళవారం కంబదూరు మండలం తిమ్మాపురం రెవెన్యూగ్రామ పరిధిలో ఉన్న ఓబుగానిపల్లి వద్ద సర్వేనంబర్ 258–1, 246లో జరుగుతున్న గ్రౌండ్ ట్రూథింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టుపక్కల రైతులకు నోటీసులు అందించి రీసర్వే చేయాలన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వమూ ఉండరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిషన్, రీసర్వే డీటీ గణేష్బాబు, డీఐఓఎస్ నాగరాజు సర్వేయర్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మల్బరీ సాగు లాభదాయకం
కుందుర్పి: మల్బరీ సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో రైతులు సాగుచేసిన మల్బరీ పంటలను, ఇటీవల గ్రామంలో నిర్మించిన పట్టు పురుగుల చాకీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కళ్యాణదుర్గం డివిజన్లో 1500 ఎకరాల్లో మల్బరీసాగు చేయడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఓబుళేసు, ఎంపీడీఓ శంకర్, సెరికల్చర్ ఏడీఏ రేణుక, ఎస్ఓ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.


