వ్యక్తి దారుణ హత్య
గుంతకల్లు: కుళాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో తలెత్తిన ఘర్షణ హత్యకు దారి తీసింది. పాత కక్షలు మనసులో పెట్టుకున్న ఓ యువకుడు కొడవలితో మరొక యువకుణ్ని దారుణంగా నరికి చంపిన ఘటన గుంతకల్లులో చోటు చేసుకుంది. హతుని భార్య ఫిర్యాదు మేరకు... పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపంలో కురబ చంద్రశేఖర్(30), పుష్పవతి దంపతులు నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ టైలర్ వృత్తితో పాటు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతని సొంతూరు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల. రెండేళ్ల నుంచి పాతగుంతకల్లు అంకాళమ్మ గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే కురబ బండయ్య, నాగవేణి దంపతులతో పాటు వారి కుమారుడు శివ కుమార్ ఉంటున్నారు. ఏడాది క్రితం చంద్రశేఖర్ మిరప కాయలు లోడ్ చేయడానికి కూలి పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. భార్య పుష్పవతి ఒక్కరే ఇంట్లో ఉండగా.. ఇది అదనుగా తీసుకున్న శివకుమార్ అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టాడు. ఈవిధంగా రెండు, మూడు సార్లు చేయడంతో ఆమె విషయాన్ని భర్త చంద్రశేఖర్కు తెలిపింది. దీంతో చంద్రశేఖర్, శివకుమార్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి శివకుమార్ కక్ష పెంచుకున్నాడు. ప్రతి చిన్న విషయానికీ గొడవకు దిగేవాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు అంకాళమ్మ గుడి ఏరియాలో మునిసిపల్ కుళాయిలకు నీళ్లు వదిలారు. ఇంటి సమీపంలోని కుళాయి వద్ద నీళ్లు పట్టుకోవడానికి చంద్రశేఖర్, శివ కుమార్ వెళ్లారు. నీళ్లు పట్టుకునే విషయంలో శివకుమార్ గొడవకు దిగాడు. తాను ముందుగా వచ్చానని, నీళ్లు పట్టుకుంటానని చంద్రశేఖర్ అనడంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన శివకుమార్ ఇంట్లోకి వెళ్లి కొడవలి తీసుకువచ్చాడు. కుళాయి వద్ద వంగి బిందెతో నీళ్లు పడుతున్న చంద్రశేఖర్ మెడపై మూడుసార్లు నరికాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి పుష్పవతి బోరున విలపించింది. సీఐలు మనోహర్, ప్రవీణ్కుమార్, ఎస్ఐ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు కురబ శివకుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
తాగునీటి కుళాయి వద్ద ఘర్షణ
పాత కక్షల నేపథ్యంలో కొడవలితో దాడి
అక్కడిక్కడే మృతి చెందిన చంద్రశేఖర్
వ్యక్తి దారుణ హత్య


