ఉరవకొండలో భారీ వర్షం
● మగ్గం గుంతల్లో నీటి ఊటతో
చేనేతల ఆవేదన
● వర్షాలతో పంటలకూ తీవ్ర నష్టం
అనంతపురం అగ్రికల్చర్/ఉరవకొండ: ‘మోంథా’ తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 14 మండలాల పరిధిలో 9.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరవకొండలో 80.4 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే, గుంతకల్లు 53.2 మి.మీ, రాయదుర్గం 45.4, శెట్టూరు 39.2, బొమ్మనహాళ్ 22.4, బ్రహ్మసముద్రం 20, విడపనకల్లు 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మంగళవారం పగలంతా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. ఈ వర్షాలతో పంట నూర్పిడి చేస్తున్న వరి, వేరుశనగ, మొక్కజొన్నతో పాటు టమాటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, భారీ వర్షానికి ఉరవకొండ పట్టణంలోని చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి ముడి సరుకులు దెబ్బతిన్నాయి. నష్టం అంచనాకు మంగళవారం అధికారులు సర్వే చేపట్టారు.
వేదావతి ఉగ్రరూపం
రాయదుర్గం: వేదావతి నది ఉగ్రరూపం దాల్చింది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో ‘బీటీపీ’కి వరద పోటెత్తింది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 1,655 అడుగులు కాగా, 1,653.2 అడుగులకు నీరు చేరింది. దీంతో డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు 4,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో వేదవతి హగిరిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా బీటీపీ వద్ద మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. గుమ్మఘట్ట – బ్రహ్మసముద్రం మార్గంలో వేపులపర్తి సమీపాన వేదావతిపై నిర్మించిన కాజ్వేపై నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపేశారు.
ఉరవకొండలో భారీ వర్షం
ఉరవకొండలో భారీ వర్షం


