అన్నదాత దుఃఖీభవ | - | Sakshi
Sakshi News home page

అన్నదాత దుఃఖీభవ

Jul 14 2025 4:49 AM | Updated on Jul 14 2025 4:49 AM

అన్నదాత దుఃఖీభవ

అన్నదాత దుఃఖీభవ

అనంతపురం అగ్రికల్చర్‌: అన్నదాత సుఖీభవ ‘దుఃఖీభవ’గా మారింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా రైతులకు ఎలాంటి సాయం చేయకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సీఎం చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. గత ఎన్నికల్లో రైతుల ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన వాస్తవాన్ని కూటమి నాయకులు విస్మరించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఏడాది కాలంగా సరైన వర్షాలు లేవు, పంటలు పండలేదు, అరకొరగా వచ్చిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల బాగోగులు పట్టించుకోవాల్సిన చంద్రబాబు సర్కారు ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనలకే దిక్కులేకుండా పోయింది.

మొదటి ఏడాది ఎగ్గొట్టి..

‘సుఖీభవ’ ఇదిగో అదిగో అంటూ అన్నదాతలను ఏడాది కాలంగా ఊరిస్తూ వస్తున్నా ఇప్పటికీ అతీగతి లేదు. ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ప్రకటించినా.. జిల్లా రైతులకు మొదటి ఏడాది ఇవ్వాల్సిన మొత్తం రూ.580 కోట్ల పెట్టుబడి సాయం ఎగ్గొట్టేశారు. రెండో ఏడాదైనా ఇస్తారని ఆశలు పెట్టుకున్నా ఇవ్వడం లేదు. మే అన్నారు.. తర్వాత జూన్‌ 12.. 20 అన్నారు. ఆ తర్వాత జూన్‌ ఆఖరులోపు ఇస్తామన్నారు.. మళ్లీ జూలై మొదటి వారమని ఉసూరు మనిపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ప్రకటనలకూ దిక్కులేకుండా పోయింది. ‘పీఎం కిసాన్‌’ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.14 వేలు ఇస్తామని ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. కనీసం రూ.14 వేలు ఇచ్చినా గతేడాది జిల్లాలో ఉన్న 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.406 కోట్లు మేర జమ అయ్యేవి. ఈ సారి ‘పీఎం కిసాన్‌’ కింద మొదటి విడత ఇవ్వాల్సిన సొమ్ము కూడా జాప్యం చేస్తుండటంతో రైతులు కష్టాల్లో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొంది.

కరుణ ఏదీ..?

అన్నదాత సుఖీభవతో పాటు పంటల బీమా పథకం కింద ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. మరోవైపు.. పంటలు పండక అప్పుల పాలై పిల్లల చదువులు, పెళ్లిళ్లు భారమై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. గత జూన్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 47 మంది వరకు రైతులు వివిధ రూపాల్లో బలవన్మరణం పొందినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా స్పందించకపోవడంతో బాధితుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక.. గత ఖరీఫ్‌, రబీలో పంటలు దారుణంగా దెబ్బతినడంతో కంటి తుడుపు చర్యగా కరువు మండలాలను ప్రకటించేసి ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపంలో పైసా ఇవ్వకుండా చంద్రబాబు రిక్తహస్తం చూపారు. అకాల వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు కూడా ‘ఇన్‌పుట్‌’ ఇవ్వకుండా దాటవేశారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలావడ్డీ లేదు.. వడ్డీ రాయితీ కూడా ప్రకటించలేదు. ప్రభుత్వ సాయం కరువై అన్నదాత దిక్కులు చూస్తున్నా చంద్రబాబు కరుణించే పరిస్థితి కనిపించడం లేదు.

అదిగో ఇదిగో అంటూ కాలం

వెళ్లదీస్తున్న కూటమి సర్కారు

రైతు సంక్షేమాన్ని పూర్తిగా

గాలికొదిలేసిన చంద్రబాబు

బీమా పరిహారమూ, ఆత్మహత్య బాధిత రైతు కుటుంబాలకు

ఎక్స్‌గ్రేషియా నిల్‌

వర్షాలు లేక, ‘గిట్టుబాటు’ దక్కక అల్లాడిపోతున్నా పట్టని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement