
కార్మికుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం అర్బన్: కార్మికుల జీవితాలతో చెలగాటమాడరాదని కూటమి ప్రభుత్వాన్ని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు హెచ్చరించారు. ఏడు నెలలుగా బకాయిపడిన వేతనాన్ని తక్షణమే చెల్లించాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఐఎఫ్టీయూ ఏసురత్నం, రైతు కూలీ సంఘం రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం రామకృష్ణ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు మాట్లాడుతూ.. నెలలుగా వేతనం చెల్లించకపోతే కార్మికులు ఎలా బతుకుతారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వేతనాలు చెల్లించాలంటూ 85 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం కానీ, అటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. యోగా డే అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వానికి కార్మిక కుటుంబాల ఆకలి కేకలు వినిపించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఏడు నెలల వేతన, 40 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లింపుల విషయంలో వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ కార్మికులకు బకాయిలు చెల్లించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల బకాయిలు పూర్తిగా చెల్లించే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిస్వామి, రాము పాల్గొన్నారు.