
సీఆర్ఎంటీలకు బదిలీ టెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష పరిధిలో పని చేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ల (సీఆర్ఎంటీ)కు ‘బీ కాంప్లెక్స్’ల బదిలీ టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో మొన్నటి వరకు మొత్తం 155 క్లస్టర్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం రీ–ఆర్గనైజేషన్ ప్రక్రియ చేపట్టడంతో వివిధ నిబంధనలతో వాటిని 135కు కుదించారు. దీంతో మిగులుగా ఉండే సీఆర్ఎంటీఎల్లో గుబులు రేగుతోంది. తమను ఎక్కడికి సర్దుబాటు చేస్తారోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
సర్దుబాటు పేరుతో అన్యాయం
1 నుంచి 10 తరగతులు ఉన్న క్లస్టర్ స్కూళ్లలో కొత్తగా ‘బీ క్లస్టర్లు’ తీసుకొచ్చారు. ఇలా జిల్లాకు 20 బీ క్లస్టర్ స్కూళ్లు వచ్చాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం పని చేస్తున్న మండలాల్లో కాకుండా పక్క మండలాల్లో ఎక్కువగా ఉండడంతో సీఆర్ఎంటీలు భయపడుతున్నారు. అనంతపురం అర్బన్ పరిధిలో 12 కాంప్లెక్స్లుంటే ఆరు రద్దయ్యాయి. మరో నాలుగు కొత్తగా వచ్చాయి. అంటే మొత్తం 10 క్లస్టర్ స్కూళ్లు ఉన్నాయి. ఇక్కడ 12 మంది సీఆర్ఎంటీలు పని చేస్తున్నారు. మిగులుగా ఉన్న ఇద్దరిని పక్క మండలాల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. సమీపంలో అంటే గార్లదిన్నె మండలంలో ఒక బీ క్లస్టర్ స్కూల్ ఉంది. మరొకటి దరిదాపుల్లో లేదు. అలాగే నార్పల మండలంలో ఒక సీఆర్ఎంటీ మిగలగా, చుట్టుపక్కల మండలాలైన శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురంలో ఖాళీలు లేవు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందని బాధిత సీఆర్ఎంటీలు వాపోతున్నారు.
జీతం అక్కడ...పని ఇక్కడ!
మరోవైపు సీఆర్ఎంటీలు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అదే మండలాల్లోనే ఉంటారని జీతం సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ‘బీ కాంప్లెక్స్’లను తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. మిగులుగా ఉన్న సీఆర్ఎంటీలు బీకాంప్లెక్స్కు కేటాయించినా జీతాలు అక్కడ తీసుకుంటూ పని మాత్రం ప్రస్తుతం చేస్తున్న చోటే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. భవిష్యత్తులో ప్రతి నెలా ఇక్కడ పని చేస్తూ జీతాలు వేరే మండలాల ఎంఈఓలు చేయాలంటే ఏమి అడ్డంకులు చెబుతారోనని ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నామమాత్రంగా ఉన్న బీక్లస్టర్ల అవసరం లేదని నివేదికలు సిద్ధంచేసి, వాటిని తీసేస్తే తమ పరిస్థితి ఏమి కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సీఆర్ఎంటీలు శుక్రవారం సమగ్రశిక్ష కార్యాలయానికి వచ్చారు. ఏపీసీ శైలజ అందుబాటులో లేకపోవడంతో మాజీ ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డిని కలసి తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు ఎలాంటి ఇతరత్రా అలవెన్సులు ఉండవని, నామమాత్రపు జీతాలతో పని చేస్తున్న తమను దూర మండలాలకు పంపితే ఇబ్బంది పడతామని వాపోయారు. బీక్లస్టర్ స్కూళ్లకు మ్యాపింగ్ చేసి, పనిమాత్రం ప్రస్తుతం ఉన్నచోట చేయాలని చెబుతున్నా భవిష్యత్తులో ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రీ–ఆర్గనైజేషన్ అనంతరం జిల్లాలో 20 బీ క్లస్టర్ స్కూళ్లు
సర్దుబాబు పేరుతో సొంత మండలాల్లో కాకుండా దూర మండలాలకు పంపే ప్రయత్నం
లబోదిబోమంటున్న సీఆర్ఎంటీలు