
బోడాయిపల్లిలో వేటకొడవళ్లతో స్వైరవిహారం
తాడిపత్రి టౌన్: మండలంలోని బోడాయిపల్లిలో శుక్రవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, అదే గ్రామానికి చెందిన రంగనాథ్ భార్యపై దాదాపు ఏడాది క్రితం అత్యచారయత్నం చేశాడు. ఆ సమయంలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ నిర్వహించి కుళ్లాయప్పపై ఏడాది పాటు గ్రామ బహిష్కరణ విధించారు. ఏడాది పూర్తి కావడంతో కుళ్లాయప్ప గ్రామానికి చేరుకుని తన సోదరుడు బాలయ్యతో కలిసి గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం ఉదయం పనుల్లో నిమగ్నమైన సమయంలో రంగనాథ్తో పాటు రాజేష్, రంగ సుధాకర్, పృథ్వీ, రాకేష్, హరీంద్ర మరో ముగ్గురు అక్కడకు చేరుకుని వేటకొడవళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. దాడిని ప్రతిఘటిస్తూ తనకు అందుబాటులో ఉన్న వేటకొడవలితో కుళ్లాయప్ప కలబడాడ్డు. ఘటనలో కుళ్లాయప్ప కాలుకు, చేతిపై నరుకుడు గాయాలయ్యాయి. రంగనాథ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఇరువురి పరిస్థితి విషమంగా మారింది. బాలయ్య, రాజేష్, రంగసుధాకర్, పృద్వీ, హరీంద్రకు చిన్నపాటి రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని దాడులను అడ్డుకుని క్షతగాత్రులను తొలుత తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ శివగంగాధర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

బోడాయిపల్లిలో వేటకొడవళ్లతో స్వైరవిహారం