
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. రోడ్డు భద్రతపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోలతో కలసి ఎస్పీ మాట్లాడారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను చేర వేసే వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ప్రమాదాలకు గల కారణాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఇందు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ అతి వేగంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
19 వేల మందిపై కేసు నమోదు
ఈ ఏడాది మే1వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 19,982 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ వీర్రాజు తెలిపారు. వీరిలో హెల్మెట్ దరించకుండా డ్రైవింగ్ చేసిన 544 మంది, ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపిన 749 మంది, డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ.. ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన 13,892 మంది, మద్యం సేవించి వాహనాలు నడిపిన 282 మంది ఉన్నారన్నారు. వీరికి రూ.56,96,885 జరిమానా విధించినట్లు వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజగోపాల్, జాతీయ రహదారి శాఖ పీడీ తరుణ్, పంచాయతీరాజ్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు చర్యలు
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్సీ పి.జగదీష్ ఆదేశించారు. నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఈగల్ టాస్క్ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ జగదీష్ ఆదేశం