
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో గందరగోళం
అనంతపురం కార్పొరేషన్: సచివాలయ ఉద్యో గుల బదిలీల ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం బదిలీలు చేపట్టాలని ఆగమేఘాలపై సర్క్యులర్ విడుదలైంది. ముందురోజు అర్ధరాత్రి 11 గంటలకు సంబంధిత ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం తెలపడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వర్తించే సచివాలయ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలోని జీసస్నగర్లోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి నేతృత్వంలో వివిధ మునిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో బదిలీల కౌన్సెలింగ్ జరిగింది.
స్పష్టతలో జాప్యం : ఉమ్మడి జిల్లాలో 304 సచివాలయాల పరిధిలో 286 మంది అడ్మిన్ పోస్టులుండగా.. అందులో 18 ఖాళీలున్నాయి. కౌన్సెలింగ్కు 176 మంది అడ్మిన్లు హాజరయ్యారు. మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్ ఎవరైనా ఏదైనా మునిసిపాలిటీ పరిధిలో 5 ఏళ్ల పాటు పని చేసి ఉన్న వారు బదిలీకి అర్హులని చెప్పారు. దీంతో దీనిపై స్పష్టత రాలేదు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 74 సచివాలయాల్లో పది మందికిపైగా బిల్ కలెక్టర్లు అడ్మిన్లు చేస్తున్నారు. ఈ సచివాలయాలను బదిలీల జాబితాలో చూపలేదు. మునిసిపాలిటీల్లో వివిధ సచివాలయాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొందరినీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. ఇతర మునిసిపాలిటీల్లో ఈ విధంగా జరగడం లేదన్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్కు ఫిర్యాదు చేశారు. మరోసారి బదిలీ జాబితాను పక్కాగా నమోదు చేసి బదిలీలు చేపట్టాలని కమిషనర్ బాలస్వామిని ఆర్డీ ఆదేశించారు. దీంతో గంటసేపు పైగా బదిలీల కౌన్సిలింగ్ నిలిపివేశారు.
తమ్ముళ్ల సిఫార్సు : బదిలీల్లో తెలుగు తమ్ముళ్ల సిఫార్సు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల లెటర్లతో కొందరు బదిలీలకు రావడంతో వివిధ మునిసిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాలను అధికారులు ఖాళీలు చూపనట్లు తెలుస్తోంది. దీంతో అర్హులైన ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
అడ్మిన్ బదిలీల కౌన్సెలింగ్ రసాభాస.. వాయిదా :
అడ్మిన్ బదిలీల కౌన్సెలింగ్ రసాభాసగా సాగింది. శుక్రవారం రాత్రి ఉద్యోగుల ర్యాంక్, స్పౌజ్ల విషయంలో గందరగోళం నెలకొంది. పారదర్శకంగా చేపట్టడం లేదంటూ అడ్మిన్ కార్యదర్శులు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆర్డీ విశ్వనాథ్ బదిలీల కౌన్సెలింగ్ వద్దకు చేరుకున్నారు. బదిలీలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని, తమకు అన్యాయం జరగుతోందంటూ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బదిలీల కౌన్సెలింగ్ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీ విశ్వనాథ్ ప్రకటించారు.